టీడీపీ కథ ముగిసినట్టే!

SRISHIVA
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా సాగింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఫ్యాన్ సునామి వీచింది. ఏపీలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా.. అన్ని కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. మున్సిపాలిటీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మెదుకూరులోనే టీడీపీ లీడ్ సాధించింది. అయితే ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ ఎక్స్ అఫిషియో మెంబర్లతో కలిసి వైసీపీనే మేయర్ పీఠం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటుంది. ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును చెడుగుడు ఆడుకుంటున్నారు.
పట్టణ ఓటర్లు 20 మాసాల తర్వాత తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అర్బన్‌లో తనకేదో బలముందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం పేరిటి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి గెలవాలని అనుకున్నాడని మండిపడ్డాడు. 21 మాసాల సీఎం జగన్‌ పరిపాలనకు ప్రజలు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఇంత బ్రహ్మాండమైన విజయం గతంలో ఏ అధికార పక్షానికి రాలేదని, ఇంత వైఫల్యం ఏ ప్రతిపక్షానికి రాలేదని తెలిపారు. రాష్ట్రంలో నిజమైన హీరో వైఎస్ జగన్ అని ప్రజలు నిరూపించారని అంబటి తెలిపారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఫలితాలు వస్తున్న వేళ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. పాచి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్లారా అని ప్రశ్నించారు. బాబు ఈవీఎం టాంపరింగ్ అన్నాడు. కానీ బ్యాలెట్ పేపర్‌లోను అదే మెజార్టీ వచ్చిందని తెలిపారు.
దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత పుత్రుడు లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.  పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయిందని, రాష్ట్రంలో ఈ దెబ్బతో టీడీపీ  కనుమరుగైపోయిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌ని ఎదుర్కొనే పార్టీ ఏదీ లేదని అంబటి స్పష్టం చేశారు.2019 సాధారణ ఎన్నికల్లో కంటే ఎక్కువ ప్రేమను ప్రజలు ఈ ఎన్నికల్లో చూపించారని అంబటి తెలిపారు. ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవని చెప్పారు. టీడీపీనే ప్రజలు నమ్మలేదని, ఇక వాళ్ల మేనిఫెస్టోని ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. వైజాగ్, విజయవాడతో సహా అన్ని చోట్లా ప్రజలు పౌరుషం చూపించారని తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే అమరావతికి ప్రజల మద్దతు లేనట్టే అన్నాడని,  మరి గుంటూరు, విజయవాడ ప్రజలు అమరావతికి మద్దతు ఇవ్వలేదని స్పష్టమవుతోందని అంబటి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: