హాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?

Chakravarthi Kalyan
సాక్షి.. తెలుగు పత్రికల్లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న పత్రిక. ఈనాడుపై కోపంతో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి పెట్టిన పత్రిక ఇది. సీఎం జగన్‌ది ఇది ఓ బలమైన అండ. అయితే ఈ పత్రిక యజమానులే రెడ్డి అన్న సంగతి లోకానికి తెలిసిందే. అయితే తాజాగా ఈ పత్రికలో ప్రచురించిన ఓ వార్తలో ఓ నిందితుడి పేరులో రెడ్డి అనే పదం తీసేశారట. సదరు నిందితుడి కారణంగా రెడ్డి కులానికి చెడ్డ పేరు వస్తుందని తీసేశారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ విషయాన్ని  రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. నరసరావుపేటకు చెందిన అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. రెడ్డి అని పక్కన తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా అంటూ వంగలపూడి అనిత  ప్రశ్నించారు.
ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఆమె సాక్షి ప్రస్తావన తెచ్చారు. సాక్షి పేపర్లో నిందితుడి పేరుకి రెడ్డి తీసేసి వార్త రాశారని వంగలపూడి అనిత చెప్పారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని, కనీసం దిశా చట్టం కూడా కరెక్టుగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని వంగలపూడి అనిత  అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళల మానాలు, ప్రాణాలు రెండూ పోతున్నాయని వంగలపూడి అనిత  ఆవేదన వ్యక్తం చేశారు.
ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఊదరగొట్టారని, నరసరావుపేట అనూష కేసుపై జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు. అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడుకి శిక్ష పడితే సీఎం జగన్‌కు సలాం చేస్తామని వంగలపూడి అనిత అన్నారు. ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించడా అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఏపీ హోంమంత్రి సుచరిత కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని, ఆ బొమ్మకు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సీఎం జగన్ కీ ఇస్తేనే ఆడుతుందని వంగలపూడి అనిత  విమర్శించారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: