ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు పెద్ద షాక్..

Deekshitha Reddy
ఇప్పటికే బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకుంటుండటంతో.. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. పని ఉన్నా లేకున్నా.. పనిగంటలు మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే. ఫీల్డ్ వర్క్ ఉండే వీఆర్వోలు ఈ బయోమెట్రిక్ మాకొద్దు అంటూ ఏకంగా ఓ ఉద్యమాన్నే తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సచివాలయ ఉద్యోగులకు షాకిస్తోంది.
ఇప్పటికే సచివాలయాల ద్వారా గ్రామాల స్వరూపం మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి గ్రామాలకు డిజిటల్‌ విప్లవం తీసుకొస్తోంది. ప్రస్తుతం మండల కేంద్రాలకే పరిమితమైన వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని గ్రామ సచివాలయాల స్థాయికి తీసుకెళ్లాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్‌ టీవీలు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులు నేరుగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు లేదా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడానికి ఈ టీవీలను ఉపయోగిస్తారు. దీంతో సచివాలయ ఉద్యోగులు పని వేళల్లో కచ్చితంగా ఆఫీస్ లోనే ఉండాలి. అలా కాదని బైటకు వెళ్తే.. వీడియో కాన్ఫరెన్స్ లో విషయం తెలిసిపోతుంది. అంటే.. ఇకపై సచివాలయ ఉద్యోగులు హాజరుతోపాటు.. పనిటైమ్ లో సచివాలయం దాటి వెళ్లడానికి వీళ్లేదన్నమాట.
ఇక పథకాల లబ్ధిదారుల జాబితాలను కూడా డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా ప్రదర్శించాలని నిర్ణయించారు. సెంట్రల్‌ సర్వర్‌ ద్వారా విజయవాడ నుంచే లబ్ధిదారుల పేర్లు, సంఖ్య మార్చే అవకాశముంటుంది. ఏ పథకం.. ఏ నెలలో ఎప్పుడు అమలవుతుందనే వివరాలను కూడా డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కూడా వీటి ద్వారా తెలియజేస్తారు. దీని వల్ల పోస్టర్ల వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలను సకాలంలో అందించేందుకు గాను రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలన్నింటినీ కంప్యూటరీకరించారు. 30,008 కంప్యూటర్లు, 15,004 ప్రింటర్లు, 27,646 బయోమెట్రిక్‌ మెషిన్లు, 15,004 స్కానర్లు, 14,492 ఇంటర్నెట్, 301 బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యాలతో పాటు 2,67,224 సెల్‌ఫోన్లను ప్రభుత్వం సచివాలయాలకు ఇచ్చింది. వీటి ద్వారా ప్రభుత్వం అందించే ఏ పథకమైనా క్షణాల్లో ప్రజలకు చేరువ అవుతోంది. సమస్యలు కూడా త్వరగా పరిష్కారమవుతున్నాయి.
గ్రామ సచివాలయాలకు శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామ సచివాలయాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా రూ.3,833 కోట్ల విలువైన శాశ్వత భవనాల ద్వారా గ్రామాలకు ఆస్తి చేకూరుతుంది. ఇప్పటికే 10,929 భవనాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఇందులో 1,848 భవనాల నిర్మాణం కూడా పూర్తయింది. ఒక్కో భవనాన్ని 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: