మత్స్యకారులకు శుభవార్త
జిల్లాలో 211 ఇన్లాండ్ మత్స్యకార సంఘాలు , 43 మెరైన్ మత్స్యకార సంఘాలు , 81 మహిళా మత్స్య కార సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం 38,914 మంది మత్స్యకారులు వీటి పరిధిలో జీవనోపాధి పొందుతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మత్స్య కారులకు బహుళ ప్రయోజనాలున్నాయి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో ఉంటూ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టే ప్రతి ఒక మత్స్యకారులు తగిన ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతున్న వారికీ దీని ద్వారా ఆ సమస్యలు తీరిపోతాయి . రొయ్యలు చెరువులు సాగు చేసే మత్స్యకారులైతే దాణా, మందులు కొనుగోలు చేయడానికి చాల అప్పులు చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సౌకర్యం గతంలో ఉండేది. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతకాలం నిలుపుదల చేశారు. కాగా ఈ పథకాన్ని కేంద్రం మళ్లీ పునరుద్ధరింపజేసింది. ప్రస్తుతం ఈ కార్డులు సొసైటీల పరిధిలో యాక్టివ్గా ఉన్న మత్స్యకారులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ కార్డులు చేప రైతుల అంటే వ్యక్తిగతంగా, గ్రూపులు, భాగస్వాములు, కౌలుకు సాగు చేసే వారు తో పాటు సెల్ఫ్హెల్ప్, జాయింట్ లైబలిటీ, మహిళా మత్స్యకార గ్రూపులు పొందేందుకు ప్రభుత్వం అర్హులుగా నిర్ణయించారు. అలాగే ఈ కార్డులు వర్కింగ్ కాపిటల్ కాంపొనెంట్తో సాగు చేసే మత్స్యకారులకు కూడా పొందేందుకు అర్హులు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సీడ్, ఫీడ్, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, హార్వస్టింగ్స్, మార్కెటింగ్ చార్జీలు, ఆయిల్, విద్యుత్ చార్జీలు, ఐస్, ల్యాండింగ్ చార్జీలు లేబర్, లీజ్ల కోసం ఈ కార్డుల ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు.
ఈ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. చేపల పెంపకం, వేట, విక్రయాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించవచ్చు. అర్హులైన వారిని గుర్తిస్తున్నామని, జనవరి 1వ తేదీ నుంచి వారికి మత్స్యశాఖ తరఫున కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్టు మత్స్యశాఖ డీడీ రాఘవరెడ్డి తెలిపారు.