సిల్క్ రోడ్ (ఓబిఓఆర్) విషయం లో భారత్ అనుమానం నిజమేనన్నట్లు ఒకరకంగా ఋజువైనట్లే. చైనా చాలా ఆర్భాటంగా ప్రచార ఖండూతిని తీర్చుకుంటూ ప్రతిష్ఠాత్మకం గా నిర్వహించిన సిల్క్రోడ్ (వన్ బెల్ట్-వన్ రోడ్) సదస్సులో "వాణిజ్య ప్రకటన" పై తమ అంగీకార సూచనగా సంతకాలు చేయడానికి అనేక యూరప్ దేశాలు అంగీకరించ లేదు. తమ ఈ విశాల ప్రయత్నానికి విశ్వం యావత్తూ సహకరిస్తుందని, తానొక మరో ప్రపంచ పెద్దన్నగా మార్పు చెందే కలలకు కంటూ మద్దతు కూడగట్టాలని ప్రయత్నిం చిన చైనాకు ధారుణమైన భంగపాటు కలిగించే పరిణామమే ఈ యూరప్ దేశాల సంతకాల నిరాకరణ. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, పోర్చుగల్, ఎస్టోనియా తదితర దేశాలు దీనిపై సంతకాలు చేయ నిరాకరించాయని అభిజ్ఞవర్గాల సమాచారం.
ఆసియా దేశాల నుంచి యూరప్ దేశాల నుండి ఆఫ్రికాలకు ఉన్న అతి ప్రాచీన చారిత్రాత్మక వాణిజ్య ద్వారాలను మార్గాలు నిర్మించి పునరుద్ధరించడానికి అత్యంత భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పించే పనుల్ని తనకుతానే నెత్తికెత్తుకున్న చైనా ఈవిషయం లో ఎదురుదెబ్బ తిన్నట్లే అంటున్నారు. తద్వార ఈ సదస్సు ముఖ్యఉద్దేశం నెరవేరలేదు. పారదర్శకత, సామాజిక - పర్యావరణ అనుకూల విషయాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా చైనా ప్రవేశ పెట్టిన ముసాయిదా లేకపోవడం తో సంబంధిత అంగీకార పత్రంపై సంతకాలు చేయరాదని ముఖ్యమైన యూరప్ దేశాలు నిర్ణయించాయి. కొత్త సిల్క్రోడ్ల వల్ల చైనా ఎగుమతి దారుల ప్రయోజనాలకే పెద్దపీట లభిస్తుందని ఇతరుల వ్యాపారాలు ధారుణంగా నశించి పోతాయనే ఉద్దేశం అన్నీ ఖండాల్లోని అనేక దేశాలకు ఉంది.
"బెల్ట్ అండ్ రోడ్ ఫోరం" తదుపరి రెండో సదస్సు సమావేశం 2019లో నిర్వహించనున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సదస్సు చివరలో ప్రకటించారు. రెండ్రోజుల పాటు జరిగిన తొలి సదస్సు సోమవారం ముగిసింది. తమ ప్రయత్నంపై భారత్ ఆందోళన వ్యక్తపరిచినా దీని అమలుకు పెద్ద వూపు వచ్చిందని జిన్పింగ్ చెప్పారు. పాక్ సహా 68 దేశాలు, అంతర్జాతీయ సంస్థ లు "బెల్ట్ అండ్ రోడ్" సహకార ఒప్పందంపై చైనాతో సంతకాలు చేశాయని ఆయన విలేకరులకు తెలిపారు. కాని యూరప్ దేశాలు సదస్సులో పాల్గొన్నా భారత్ లాగే చైనా అంతరంగాన్ని అర్ధచేసుకున్నాయి. ఇది ఒక రకంగా భారత్ కు నైతిక విజయమే.