5ఏళ్ల చిన్నారిని కత్తితో పొడిచి చంపిన ఎన్నారై..?

Suma Kallamadi
బ్రిటన్‌లో స్థిరపడిన ఒక భారతీయ కుటుంబం లో ఒక దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లే అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఐదేళ్ళ కూతురిని కత్తితో పొడిచి చంపేసింది. తన కూతురిని తన భార్యే హత్య చేసిందని తెలుసుకొని భర్త తల్లడిల్లిపోయారు. ఈ విషాద ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే.. భారత సంతతికి చెందిన సుధా శివనాదం అనే యువతి 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న తరువాత తన భర్తతో సహా ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడే స్థిరపడింది. ఈ దంపతులకు సాయగి శివనాదం అనే ఐదేళ్ళ పాప కూడా ఉంది.
ఐతే 2020 సంవత్సరం లో కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. యూకే ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ విధించడంతో సుధా శివనాదం తన భర్త, ఐదేళ్ల కూతురుతో కలిసి ఇంట్లోనే సమయం గడిపింది. అయితే ఆమె ప్రతి రోజు టీవీ ఛానల్ లలో కరోనా గురించి పదేపదే వార్తలు చూస్తూ బాగా భయపడిపోయింది. తనకు కూడా కరోనా వైరస్ సోకుతుందేమో అని తీవ్ర భయాందోళనకు గురయ్యింది. కరోనా గురించి అతిగా ఆలోచించి ఆమె మానసికంగా కుంగి పోయింది. ఇక చివరికి తాను కరోనా వల్ల చనిపోవడం ఖాయమని బలంగా భావించింది.
అయితే చనిపోవడం ఖాయమని భావించిన సుధా శివనాదం.. తాను చనిపోతే తన కూతురి పరిస్థితి ఏంటని తీవ్ర మనోవేదనకు గురి అయింది. అయితే గతేడాది జూన్ 30వ తేదీన భర్త నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్లగా.. సుధా శివనాదం ఒక కత్తితో తన కూతురిని 15 సార్లు విచక్షణారహితంగా పొడిచి చంపేసింది. అనంతరం తాను కూడా కత్తితో తీవ్రంగా గాయపరచుకుంది. అయితే భర్త ఇంటికి చేరుకోగానే ఇంట్లో జరిగిన దారుణాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన కూతురు రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యాడు. అయితే తన భార్య కూడా తీవ్రమైన గాయాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. అయితే సంవత్సరం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సుధా శివనాదం ఇటీవలే కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో ఆమెను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే ప్రస్తుతం బ్రిటన్ న్యాయస్థానం ఈ కేసుపై విచారణ జరుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: