అఫీషియల్ అయితే వచ్చింది ... మరి హిట్ కొట్టేనా ... ??

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమకి దిల్ రాజు సంస్థైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు వంశీ పైడిపల్లి. అంతకముందు పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి మంచి అనుభవం సంపాదించిన వంశీ తీసిన ఫస్ట్ మూవీ మున్నా. రెబల్ స్టార్ ప్రభాస్, ఇలియానా హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. అయితే ఆ తరువాత మరొక్కసారి దిల్ రాజు బ్యానర్ లో ఎన్టీఆర్, సమంత, కాజల్ కలయికలో తీసిన బృందావనం సినిమా ద్వారా సూపర్ హిట్ కొట్టి మొత్తానికి కెరీర్ పరంగా బ్రేక్ సొంతం చేసుకున్నారు వంశీ పైడిపల్లి.
ఇక దాని అనంతరం రామ్ చరణ్ తో ఆయన తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎవడు, అలానే ఆపైన నాగార్జున, కార్తీ లతో వంశీ తీసిన ఊపిరి సినిమాలు రెండూ కూడా సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఇక సరిగ్గా రెండేళ్ల క్రితం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి వంటి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ మూవీ తీసిన వంశీ దానితో కూడా మరొక హిట్ కొట్టి టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు అందుకున్నారు. అయితే విషయం ఏమిటంటే వంశీ తన తదుపరి సినిమాని కోలీవుడ్ స్టార్ నటుడు ఇలయతలపతి విజయ్ తో చేయనున్నారు అంటూ ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో దానిపై అఫీషియల్ గా నేడు కొద్దిసేపటి క్రితం న్యూస్ బయటకు వచ్చింది.
దిల్ రాజు నిర్మించనున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా గురించిన పూర్తి వివరాలు దసరా పండుగ రోజున వెల్లడి కానునంట్లు సమాచారం. హీరో విజయ్ కెరీర్ 66వ మూవీగా రూపొందనున్న ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉండడంతో పాటు ఆయన ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా భారీ కమర్షియల్, యాక్షన్ హంగులు ఉండేలా దర్శకుడు వంశీ ఈ మూవీ కథని ఎంతో అద్భుతంగా రాసుకున్నట్లు వినికిడి. ఇక ఈ సినిమాని త్వరలో ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో విడుదల చేసేలా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇప్పటివరకు తెలుగులో మంచి సక్సెస్ లతో దూసుకెళ్లిన వంశి, తొలిసారిగా కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ తో చేస్తున్న ఈ మూవీ ద్వారా ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: