'ఎవడన్నా వాడు.. సంబంధం లేకుండా వచ్చి అందరినీ ఏసేసి వెళ్లాడు..', 'సంబంధం ఉంది.. వాడి పేరు ఢిల్లీ'..అనే డైలాగ్ తో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ ని 'ఖైదీ' సినిమాతో షేక్ చేశాడు కార్తీ.ఈ డైలాగ్ 'ఖైదీ' మూవీ ఆఖరి డైలాగ్. మరి ఇందులో విలన్ ఆది శంకరుడు, ఢిల్లీ మధ్య ఉన్న వైరం ఏంటి? ఢిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకబోతున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఖైదీ' మూవీ సీక్వెల్ వచ్చే ఏడాది పట్టాలెక్కబోతున్నట్లు నటుడు కార్తి తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్-1' ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిని 'ఖైదీ2' గురించి అడగ్గా, ఆయన స్పందించారు. 'వచ్చే ఏడాది 'ఖైదీ2' మొదలు పెడతాం' అని అన్నారు. తొలి భాగంతో పోలిస్తే, ఈసారి బడ్జెట్ కూడా బాగా పెంచినట్లు కోలీవుడ్ సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న కార్తి కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'... 2019 వ సంవత్సరంలో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని వార్తలు వినిపించినా, కార్తి స్పష్టత ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ విజయ్తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే 'ఖైదీ2' మొదలవుతుంది. ఇది 'ఎల్సీయూ'(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) భాగంగా రూపొందనుంది. మరి ఇందులో రోలెక్స్(సూర్య) ఉంటారా? లేదా? అన్నది ఆసక్తికరం. ఇప్పటికే 'ఖైదీ2' కథకు సంబంధించి లోకేశ్ కనగరాజ్ రఫ్ డ్రాఫ్ట్ పూర్తి చేసినట్లు సమాచారం. ఒకవైపు విజయ్ సినిమా చేస్తూనే, 'ఖైదీ2' స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నారట.మరి చూడాలి ఈ ఖైదీ 2 ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో మరి.