అష్టదిగ్బంధంలో మణిరత్నం !
ముఖ్యంగా రాజమౌళి మ్యానియా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన తరువాత ఈనాటి తరం ప్రేక్షకులు మణిరత్నం ను కేవలం పాత సినిమాల దర్శకుడుగానే చూస్తున్నారు. అయితే మణిరత్నంలో ఉత్సాహం ధైర్యం ఏమాత్రం తగ్గకపోవడంతో భారీ సినిమాలు తన సొంత బ్యానర్ పై తీస్తూనే ఉన్నాడు. ఈ ప్రయత్నాలలో అతడికి నష్టాలు ఆరోగ్య సమస్యలు ఏర్పడినా పట్టించుకోవడంలేదు.
ఇలాంటి పరిస్థితులలో మణిరత్నం తన శక్తియుక్తులు అంతా ధారపోసి నిర్మించిన ‘పొన్నియన్ సెల్వం’ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ ఈనెల 30న విడుదల అవుతోంది. ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీస్థాయిలో చెన్నైలో చేసారు. హైదరాబాద్ లో కూడ ఈమూవీ ఈవెంట్ ఉంటుంది అని అంటున్నారు. ఈమూవీని తెలుగులో కూడ డబ్ చేసి విడుదల చేస్తున్నప్పటికీ ఈమూవీ పై ఎక్కడా క్రేజ్ ఏర్పడంలేదు.
చరిత్రలోని చోళరాజుల జీవితాలలోని కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈమూవీని తీసారు. అయితే ఈమూవీ నిర్మాణంలో భారీ తనం కనిపిస్తోంది కానీ ఈమూవీ ఆడియో ఏమాత్రం సఘటు సినిమా ప్రేక్షకుడుకి నచ్చలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీకి పోటీగా పాన్ ఇండియా స్థాయిలో హృతిక్ రోషన్ నటించిన ‘విక్రమ్ వేద’ విడుదల అవుతోంది. ఇక తెలుగు సినిమాలకు సంబంధించి ఈమూవీ విడుదలైన ఒక్క వారం రోజులకే ‘గాడ్ ఫాదర్’ ‘ది ఘోస్ట్’ లాంటి టాప్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో ఇన్ని సినిమాల మధ్య మణిరత్నం సినిమా పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..