యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ 'బాహుబలి' సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాల్లోనూ, అంతకుమించిన సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో సాహో , రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలలో నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే.
ఈ రెండు సినిమాలను కూడా యు.వి.క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. బాహుబలి సినిమా తర్వాత రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటించినప్పటికీ ప్రభాస్ కు ఈ రెండు సినిమాల్లో ఏది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని తెచ్చి పెట్టలేక పోయాయి. బాహుబలి సినిమా తర్వాత రెండు అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న ప్రభాస్ ప్రస్తుతం కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 నుండి 35 శాతం పూర్తి అయినట్లు ఈ సినిమా ప్రొడ్యూసర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
సలార్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మే 17 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగివున్న సలార్ సినిమాపై సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ చేసిన వ్యాఖ్యలు మరింత అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సినిమాటో గ్రాఫర్ భువన్ గౌడ మాట్లాడుతూ... కే జి ఎఫ్ మూవీ కంటే సలార్ మూవీ మూడు రెట్లు భారీగా ఉంటుంది అని తెలియజేశాడు. ఈ సినిమాకు మంచి నిర్మాత దొరకడం చాలా అదృష్టం అని ఆయన చెప్పుకొచ్చాడు.