వెల "సిరి" : పాటకోసమే బతికావన్న ఇళయరాజా

Chakravarthi Kalyan
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నివాళులు అర్పించారు. వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించారని ఇళయ రాజా గుర్తు చేసుకున్నారు. తనదైన ముద్రతో అందమైన, అర్థవంతమైన,
సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు.. అంటూ ఇళయ రాజా స్మరించుకున్నారు.

సిరివెన్నెలతో అనుబంధం గుర్తు చేసుకున్న ఇళయ రాజా.. ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న  సరస్వతీ పుత్రుడని కొనియాడారు. మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి... రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు...రేపు రాబోయే " రంగమార్తాండ " కూడా..
సీతారాముడు  రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో అంటూ స్మరించుకున్నారు ఇళయ రాజా.

ఇళయ రాజా ఇంకా ఏమన్నారంటే.. “ సీతారాముడు.. పాటతో ప్రయాణం చేస్తాడు.. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు... పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాటనిస్తాడు... మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ  గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించింది. నాతో శివ తాండవం చేయించిందన్నారు ఇళయ రాజా.

"వేటూరి" .. తనకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... "సీతారాముడు" ..  నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడని ఇళయరాజా గుర్తు చేసుకున్నారు. ధన్యోస్మి మిత్రమా..!! ఇంత త్వరగా  సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది..  పాటకోసమే బ్రతికావు, బ్రతికినంత కాలం పాటలే రాసావు... ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని నివాళి అర్పించారు ఇళయరాజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: