సిరివెన్నెల గారి పాటల్లో ఉన్న గొప్పతనం అదే .... ??

GVK Writings
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేకమంది గేయరచయితలు వచ్చారు వెళ్లారు. అయితే వారిలో కొద్దిమాత్రం ప్రేక్షకాభిమానుల మదిని తమ ఆకట్టుకునే సాహిత్యంతో దోచుకుని మంచి పేరు దక్కించుకున్నారు. అటువంటి గొప్ప గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఒకరు. చెంబోలు సీతారామశాస్త్రి తొలిసారిగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన జనని జన్మభూమి సినిమాకి పాటలు రాశారు. ఆ తరువాత మరొకసారి విశ్వనాధ్ తీసిన సిరివెన్నెల సినిమాకు అద్భుతమైన సాహిత్యం అందించిన సీతారామశాస్త్రి, అందులో సాంగ్స్ తో ప్రేక్షకాభిమానులు మనసును దోచుకున్నారు.
అందులోని ఆది భిక్షువు, చందమామ రావే, పొలిమేర దాటిపోతున్న, మరీ ముఖ్యంగా విధాత తలపున ప్రభవించిన వంటి పాటలు సిరివెన్నెల గారికి విపరీతమైన పేరు సంపాదించి పెట్టాయి. ఆ సినిమా సాంగ్స్ కి అంత అద్భుతంగా సాహిత్యం అందించిన ఆయనకి ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం లభించింది. ఇక అక్కడి నుండి వరుసగా అనేక సినిమాలు చేస్తూ కొనసాగిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనతి కాలంలోనే టాలీవుడ్ గొప్ప పాటల రచయితగా మరింత ఖ్యాతి గడించారు. ఇక ఆయన రాసే  పాటలోని సాహిత్యం అత్యద్భుతం, అజరామరం అంటూ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పలు సందర్భాల్లో సిరివెన్నెల న పొగడడం జరిగింది.
ఆయన మాత్రమే కాక అనేకమంది ప్రేక్షకులు, అభిమానులు, సినిమా ప్రముఖులు సైతం సిరివెన్నెల సాహిత్యం పై గొప్ప ప్రశంసలు కురిపిస్తుంటారు. పాట యొక్క నేపథ్యం ఎటువంటిది అయినా సరే దానిని ప్రేక్షకుడి మనసుని తాకేలా రాయగల గొప్పతనం సిరివెన్నెలది. ఇక ఆయన కెరీర్లో 3000లకు పైగా పాటలు రాయగా వాటి ద్వారా అనేక అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో సికింద్రాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సిరివెన్నెల ప్రస్తుతం మెల్లగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని మన అందరి ముందుకు రావాలని కోరుతూ పలువురు ప్రేక్షకాభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: