భారీ ఫైటింగ్ లతో బాక్సాపీస్ బద్దలవ్వాల్సిందే..!

NAGARJUNA NAKKA
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రగ్గడ్ లుక్ లోకి వెెళ్లిపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న పుష్ప మూవీలో రఫ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో ఫస్ట్‌ పార్ట్‌ క్రిస్మస్‌కి విడుదలవుతోంది. 'పుష్ప'  తర్వాత అల్లు అర్జున్ ఎక్కువగా యాక్షన్‌ స్టోరీస్‌నే ప్రిఫర్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తాడని టాక్ మొదలయ్యింది. డేట్‌ ఫిక్స్ కాకపోయినా, డిస్కషన్స్ మాత్రం జరిగాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో కూడా ఒక సినిమా ఓకే అయిందని సమాచారం.
ఇక  జూనియర్ ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్'తో బాలీవుడ్‌కి ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు. ఈ మూవీతో పాన్‌ ఇండియన్ ఇమేజ్ వస్తుందని నమ్మకంగా ఉన్నాడు తారక్. ఈ నమ్మకంతోనే కొరటాల శివ సినిమా తర్వాత యాక్షన్‌ ఫిల్మ్‌ మేకర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో  ఒక సినిమా సెట్‌ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా 'కెజిఎఫ్' రూట్‌లోనే యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తుందని ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ అయితే యాక్షన్‌ మూవీస్‌కే ఓటేస్తున్నాడు. 'రాధేశ్యామ్' తర్వాత 'సలార్'కి సైన్ చేశాడు. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది.
అక్కినేని అఖిల్ సూపర్‌ హిట్‌ కోసం చాలా కాలంగా కష్టపడుతున్నాడు. అభిమానుల అంచనాలు అందుకోవడానికి మాస్ స్టోరీస్‌ నుంచి ప్రేమకథల వరకు ప్రయత్నం చేశాడు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో..సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి కమిట్ అయ్యాడు. ఈ మూవీ కోసం కండలు పెంచి కొత్త లుక్‌లోకి కనిపిస్తున్నాడు ఈ అక్కినేని వారసుడు.  
విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా యాక్షన్‌ మూవీస్‌లో నటిస్తున్నారు. విజయ్ బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా వస్తోంది. ఇక వరుణ్‌ కూడా బాక్సింగ్ కథతోనే 'గని' అనే మూవీ చేస్తున్నాడు. బెల్లంకొండ కూడా హెవీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో 'ఛత్రపతి' రీమేక్ చేస్తున్నాడు. మొత్తానికి మన యంగ్ హీరోలు వరుస యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకుల్లో ఎనర్జీ నింపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: