విలనిజంలో సరికొత్త పంథా మోహన్ బాబుది...
మోహన్ బాబును మట్టిలో మాణిక్యం అంటే సరిగ్గా సరిపోతుంది. ఎలా అయితే బంగారం కరగపెడితే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి అందంగా మార్చుకోగలమో, అలాగే ఏ రూపంలో ఉన్నా దాని విలువ దానిదే. అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి పాత్రను నూటికి నూరుపాళ్లు పండిస్తారు. విలన్ గా వచ్చి హీరోగా ఎదిగిన చాలా తక్కువ మంది నటులలో మోహన్ బాబు ముందుంటారు. ఆయన సినీ జీవితం ఎందరికో ఆదర్శం. విలన్ అంటే కేవలం సీరియస్ గా ఉండటమే కాదు ప్రేక్షకులను నవ్వించడం కూడా అని నిరూపించారు. తన గురువు దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో తెరకెక్కిన "స్వర్గం- నరకం" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మోహన్ బాబు ఇప్పటి వరకు 520 కి పైగా సినిమాలను చేశారు.
అందులో దాదాపు 150 సినిమాల్లో హీరోగా చెయ్యగా మిగిలిన చిత్రాల్లో విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. మోహన్ బాబు విలన్ గా నటించిన సినిమాలలో ఒక ప్రత్యేక శైలితో పాత్రను అద్భుతంగా పండించేవారు. ఎక్కువగా చిరంజీవి సినిమాలలో విలన్ గా నటించి సినిమా విజయాలలో కీలక పాత్ర పోషించాడు. పాత్ర ఏదైనా 100 శాతం కష్టపడగలగల కొద్ది మంది నటులలో మోహన్ బాబు ఒకరు. ఒక విలన్ గా ఎలా ఉండాలో... విలన్ గా కామెడీని పండించే వైఖరి మోహన బాబుకు సొంతం.