హింట్ ఇచ్చిన రష్మిక ..... యంగ్ టైగర్ మూవీ లో ఫిక్స్ .... ??

GVK Writings
రష్మిక మందన్న ప్రస్తుతం చేస్తున్న ఒక్కో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంటూ కొనసాగుతున్నారు. స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక, ఫస్ట్ టైం తెలుగులో నాగ శౌర్యతో వెంకీ కుడుముల తీసిన చలో మూవీ ద్వారా టాలీవుడ్ కి నటిగా అడుగుపెట్టి దానితో సక్సెస్ అందుకున్నారు. ఆ మూవీ లో తన అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకర్షించిన రష్మిక, ఆ తరువాత విజయ్ దేవరకొండ తో గీతా గోవిందం మూవీ తో ఏకంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు.
ఆ తరువాత ఆమెకు టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించే చాన్సు దక్కడం, రిలీజ్ అనంతరం ఆ సినిమా పెద్ద విజయం దక్కించుకోవడంతో హీరోయిన్ గా రష్మిక క్రేజ్ విపరీతంగా పెరిగింది. గత ఏడాది నితిన్ తో ఆమె చేసిన భీష్మ కూడా సూపర్ హిట్ కొట్టడంతో ప్రస్తుతం రష్మిక కి టాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న పుష్ప మూవీతో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్న రష్మిక అటు పలు తమిళ, కన్నడ, హిందీ మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే త్వరలో ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయనున్న భారీ పాన్ ఇండియా ప్రాజక్ట్ లో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యారు అంటూ ఇటీవల కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


అయితే నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇంస్టాగ్రామ్ ద్వారా లైవ్ కి వచ్చిన రష్మిక, తన అభిమానుల్లో ఒకరు ఎన్టీఆర్, కొరటాల మూవీ ప్రాజక్ట్ గురించి చెప్పండి అని అడుగగా, తాను కూడా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. దానిని బట్టి ఆమె ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనది కన్ఫర్మ్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కాగా దీనిపై ఆ మూవీ యూనిట్ అధికారికంగా త్వరలో ప్రకటన కూడా చేయనుందట. మరి ఈ వార్త కనుక నిజం అయితే తొలిసారిగా ఎన్టీఆర్ తో రష్మిక జోడీని తెరపై చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: