"పుష్ప"రాజ్ కు మరో ఎదురు దెబ్బ

Vimalatha
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం "పుష్ప" షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు ఒకదాని తరువాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా సినిమా షూటింగ్ కు ప్రకృతి మరోసారి ఆటంకం కలిగించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు సుకుమార్ తో పాటు పలువురు చిత్రబృందం కూడా జ్వరాల బారిన పడ్డారు. దీంతో సినిమాకు అనుకోకుండా కొన్ని రోజులు బ్రేక్ వేయాల్సి వచ్చింది. జ్వరం నుంచి కోలుకున్న తరువాత మళ్ళీ "పుష్ప" చిత్రీకరణను ప్రారంభించారు. అయితే మళ్ళీ సినిమాకు మరో ఇబ్బంది తలెత్తిందట.
"పుష్ప" చివరి షెడ్యూల్ మారేడుమిల్లి ఫారెస్ట్‌లో జరగాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా షూటింగ్ వాయిదా పడింది. సమాచారం ప్రకారం మేకర్స్ మారేడు మిల్లి అడవిలో సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేసారు. మొదటి షెడ్యూల్ కూడా అక్కడే చిత్రీకరించింది. అయితే ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా టీమ్ ఇప్పుడు షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. గత రెండు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో మునిగిపోతున్నాయి.
దీంతో చేసేది లేక మేకర్స్ లొకేషన్ వదిలి కాకినాడలో షూటింగ్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆ తరువాత ఆయన తన వాహనంలో నుంచే అభిమానులతో మాట్లాడాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"పుష్ప"కు సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పుష్ప కథ ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్-కమ్-స్మగ్లర్ పాత్రలో కనిపిస్తాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం 2021 క్రిస్మస్ కు విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: