ఇంతకాలానికి సినిమా మొదలెడితే... అది కూడా ఆగిపోయిందా ?

Vimalatha
'దేవసేన'గా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క శెట్టి ఇప్పుడు సినిమాల జోరును తగ్గించింది. ఇంతకుముందులా వరుస సినిమాలకు ఓకే చెప్పడం లేదు. అదే ఆమె అభిమానులను నిరాశ పరుస్తోంది. "బాహుబలి" తరువాత ఏడాదికొకటి చొప్పున 'భాగమతి', 'నిశ్శబ్దం' వంటి చిత్రాలతో పకరించింది. కానీ ఆ రెండు చిత్రాలు కూడా ఆమె ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయాయి. ఆ సినిమాల ఫలితంతో స్వీటీ ఆలోచనలో పడిందో ఏమోగానీ ఇప్పటి వరకూ తన నెక్స్ట్ మూవీని మాత్రం ప్రకటించలేదు. ఇదే అదనుగా సోషల్ మీడియాలో ఆమెపై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. "సైజ్ జీరో" అనే ప్రయోగాత్మక చిత్రం కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత దానిని తగ్గించుకోవడానికి నానా ఇబ్బందులు పడింది. ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేయకపోవడానికి కూడా కారణం బరువే అని కొందరు అంటుంటే, లేదు లేదు అనుష్క పెళ్లి చేసుకోబోతోంది. అందుకే సినిమాలకు దూరంగా ఉంటోంది అనేది కొందరి వాదన. ఈ వార్తలన్నీ అనుష్క వరకు చేరాయోమో... వాటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి కొంతకాలం క్రితం 2021లో రెండు ప్రాజెక్ట్ లు ఉండబోతున్నాయి అంటూ ప్రకటించింది. 

మరి 2021 ఏడాది సగం గడిచిపోయింది కూడా. ఇప్పటికీ ఆమె ఆ రెండు సినిమాల ఊసే ఎత్తడం లేదు. మరోవైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'జాతిరత్నాలు' హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్న సినిమాలో అనుష్క ప్రధాన పాత్ర పోషించనుంది అనే ప్రచారం జరిగింది.  'రారా కృష్ణయ్య' అనే సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ పి మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది అన్నారు. ఏమైందో ఏమోగానీ తాజాగా ఈ చిత్రం కూడా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఆ సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఈ వార్త విన్న నెటిజన్లు ఇంతకాలానికి ఆమె ఒక సినిమా స్టార్ట్ చేస్తే అది కూడా ఆగిపోయిందా? అని తలలు పట్టుకుంటున్నారు. అనుష్క ఈ ప్రాజెక్టులో నటించబోతోంది అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి స్వీటీ తన అభిమానులు ఎప్పుడు ఖుషీ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: