హీరోగా బండ్ల గణేష్... ఆ డైరెక్టర్తోనే ఫిక్స్ ?
తెలుగు సినిమా ప్రేక్షకులకు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో పాత్రల్లో నటించిన బండ్ల గణేష్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ ప్రొడ్యుసర్ అయిపోయాడు. నటనకు చాలా రోజుల క్రితమే దూరమైపోయిన బండ్ల గణేష్ గత సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో బండ్ల గణేష్ బ్లేడు గణేష్ పాత్రలో చేసినా ప్రేక్షకుల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. పైగా ఎక్కువ మంది బండ్ల గణేష్ ను ట్రోల్ చేయడంతో ఆ తర్వాత ఆ తరహా పాత్రలు తాను చేయనని బండ్ల గణేష్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక తాను నిర్మాతగా గతంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. కరోనా తగ్గిన వెంటనే బండ్ల మళ్లీ స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబులతో సినిమాలు తీసేలా బండ్ల ప్లానింగ్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే బండ్ల గురించి ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బండ్ల హీరోగా మెరవనున్నాడు. వెంకట్ అనే కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమాని తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడట.
బండ్లకు ఉన్న ఇమేజ్ను బట్టే ఈ కథను వెంకట్ రెడీ చేసుకున్నాడట. నాయి బ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు అక్కడ తీసిన మండేలా సినిమానే ఇక్కడ రీమేక్ చేస్తున్నారని.. ఆ కథనే ఇక్కడ తెలుగు నేటివిటికి అనుగుణంగా దర్శకుడు వెంకట్ మారుస్తున్నారని అంటున్నారు. ఇక పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాను సొంతంగా నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.