అగమ్యగోచరంగా మారిన సీనియర్ దర్శకుల పరిస్థితి..!
వివి వినాయక్, గుణశేఖర్, కృష్ణవంశీ, తేజ వంటి సీనియర్ దర్శకులు నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించలేకపోతున్నారు. నిజానికి ప్రస్తుతం ఈ సీనియర్ దర్శకులు 6 నుండి 8 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నారు కానీ మంచి సినిమాలను మాత్రం రూపొందించ లేకపోతున్నారు అని సినీ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. వి.వి.వినాయక్ ఇంటలిజెంట్ సినిమాతో, కె.ఎస్.రవికుమార్ రూలర్ సినిమాతో భారీ నష్టాలను చవిచూసిన నిర్మాత సి కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, రాజమౌళి మినహా ఎవరూ కూడా ఇప్పటి ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు.
నిప్పు సినిమా తరువాత గుణశేఖర్ రుద్రమదేవితో ముందుకు వచ్చారు. అతను ఇప్పుడు రానాతో హిరణ్యకసిపాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కృష్ణ వంశీ పైసా, నక్షత్రం సినిమాలతో డిజాస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. నేనే రాజు నేనే మంత్రితో ప్రేక్షకులను అలరించిన తేజ సీత సినిమాతో ఒక ప్లాప్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.
ఇటీవల సి కల్యాణ్ మాట్లాడుతూ... 'కొంతమంది మినహా కుర్ర దర్శకులందరూ ఫ్రెంచ్, కొరియన్ హాలీవుడ్ చిత్రాలను కాపీ కొడుతున్నారు. చాలామంది యువ దర్శకులు కాపీ కాట్స్ గా మారి సినిమాలు తీస్తున్నారు కానీ ప్రేక్షకులు తెలివిగా మారుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్లోని కాపీ లను కూడా కనుగొంటున్నారు. హాలీవుడ్ చిత్రాల నుండి కాపీ చేసినందుకు దర్శకులను ట్రోల్ కూడా చేస్తున్నారు,' అని ఆయన అన్నారు.