దేశంలో మరో క్షీర విప్లవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్న ఆ ఇద్దరూ

గ్రామీణ భారతంలోవ్యవసాయం తర్వాత ముఖ్య ప్రధాన ఆదాయ వనరు పాడి ,ఎంతో మందికి జీవనాధారమైన పాల ఉత్పత్తి, పశుపోషణ ద్వారానే లభిస్తుంది. వ్యవసాయాధారిత పనుల్లో పంటలతో పాటు పాడి రంగం  ముఖ్యమైనదే. బర్రెలు, ఆవులు లాంటి జంతువులను పెంచడం, పశువుల పెంపకంలో భాగమే. రైతుల జీవితాల్లో భాగమైన మూగ జీవాలు అమ్మకాలు ప్రత్యేకంగా ఏర్పడ్డ పశువుల సంతలో ఒక్కప్పుడు నమ్మకం మీద జరిగేవి. రానురాను ఈ వ్యవస్థలో కూడా దళారీల జోక్యం ఎక్కువడంతో అమ్మే వారికి, కొనేవారికి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ సమయంలోనే పాడి పశువుల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం కోసం యానిమల్ ఆప్ ను ప్రారంభించారు ఢిల్లీ ఐ.ఐ.టీ పూర్వ విద్యార్థులు నీతూ యాదవ్ ,కీర్తిజాంగ్రా. 


ముందుగా వీరిద్దరి నేపథ్యంలోకి వెళితే రాజస్థాన్ లోని నవల్ పూర్ అనే కుగ్రామం నీతూ యాదవ్ స్వగ్రామం.కుటుంబం మొత్తం వ్యవసాయ రంగంలో ఉంది. అంతేకాకుండా ఈమె తండ్రి పాడి రైతు కూడా, బాల్యం మొత్తం గ్రామీణ వాతావరణం లోనే కొనసాగింది. హర్యానా రాష్ట్రంలో ఉన్న ముఖ్య పట్టణాల్లో ఒకటైన హిస్సార్ పట్టణం కీర్తి జాంగ్రా స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నా మిగిలిన కుటుంబం మొత్తం వ్యవసాయం, పశుపోషణ రంగాల్లో ఉంది. సెలవుల్లో తమ స్వగ్రామం లో గడుపుతూ వ్యవసాయ , పాడి రంగాలను గమనించేది.

 

ఢిల్లీ ఐ.ఐ.టీ  సివిల్ ఇంజినీరింగ్ లో వీరిద్దరికి ఏర్పడ్డ పరిచయం ప్రాణ స్నేహంగా, రూమ్మేట్స్ గా మారిడానికి ముఖ్యం కారణం ఇరువురి కుటుంబాల గ్రామీణ నేపథ్యం. క్యాంపస్ లో ఉన్నంత కాలం వీరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చేవి. ముఖ్యంగా వ్యవసాయం, పాడి రంగాల మీద బాగా చర్చించేవారు.ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కూడా ఈ స్నేహితురాళ్లు నిత్యం కాంటాక్ట్ లోనే ఉండేవారు.నీతూ ఉద్యోగం లో చేరినా ఏదో అసంతృప్తి వెంటాడుతూ ఉండేది చివరికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి వెళ్ళిపోయింది. ఇదే సమయంలో కీర్తి మాత్రం కొంతకాలం పెంగ్విన్ బుక్ పబ్లిషింగ్ హౌస్ లో ఉద్యోగం చేసినా సంతృప్తి లేకపోవడంతో రాజీనామా చేసి ఉన్నత విద్యా లేకా వ్యాపారమా అన్న సందిగ్ధంలో ఉన్న సమయంలోనే అమెరికా లోని ప్రముఖ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం వచ్చింది కానీ తను మాత్రం తనకిష్టమైన వ్యాపారం వైపే మొగ్గు చూపింది. 


వీరిద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూనే క్యాంపస్ రోజులు చర్చించుకున్న ప్రతి అంశం గురించి ఫోనుల్లో కూడా చర్చించుకునేవారు. పైన చెప్పినట్లు ముఖ్యంగా పాడి రంగం మీద వీరి దృష్టి కేంద్రీకృతం అయ్యేది. చిన్నప్పటి నుంచి ఇద్దరూ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంతల్లో జరుగుతున్న అవకతవకలు చూస్తూనే పెరిగారు. పాడి పరిశ్రమ సంఘటితంగా లేకపోవడం వల్ల రైతులు తమ సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేయలేకపోతున్నారని భావించిన వారివూరు అందుకు తామేం చేయాలో ఆలోచించారు. 


అనుకున్నదే తడవుగా ఇద్దరు కలిసి పల్లెలకు వెళ్లి కొన్ని వేల మంది రైతులతో మాట్లాడి వారి  సమస్యలు, అవసరాలేమిటో తెలుసుకున్నారు. రైతులకు ఉపయోగపడేలా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని మొదట తమ కుటుంబ సభ్యులకు చెప్పగా ఇరు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అందుకు కారణం ఆన్ లైన్ లో ఆవుల్నీ, గేదెలని అమ్మే వీరి వ్యాపార ఆలోచన. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా వీరి బంధువులు, స్నేహితులు సైతం ఎగతాళి చేశారు, నిరాశపరిచారు కానీ వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా తమ వ్యాపార ఐడియా మీద పూర్తి  నమ్మకంతోనే ముందడుగు వేశారు. 


దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల పైచిలుకు పశు సంపద ఉంది, ఇందులో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాడి రైతుల వద్ద ఉన్నాయి. భారీగా జరిగే వీటి క్రయవిక్రయాలు గురించి ఇప్పటికి ఏ భారత దేశ మార్కెటింగ్ నిపుణుడు దృష్టి సారించలేదు. ఎందుకంటే వీటి అమ్మకాలు , కొనుగోళ్లు సంప్రదాయ సంతల్లోనే జరిగుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అసలు ఆన్ లైన్ లో పశువులు క్రయవిక్రయాలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వీరిని తమ గమ్యం వైపు నడిచేలా చేసింది. 


తమ సన్నిహితులు దగ్గర 50 లక్షల రూపాయలు అప్పుచేసి 2019 చివర్లో భారత సిలికాన్ సిటీ గా ప్రసిద్ధి గాంచిన బెంగుళూరు లో ఒక చిన్న గదిలో వ్యాపార ఐడియా కు ప్రాణం పోయడం ప్రారంభించారు. వీరిద్దరి ఐడియా నచ్చిన అనురాగ్, లిబిన్ బాబు లు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వారితో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. వీరు నలుగురు కలిసి "యానిమాల్" ఆప్ ను  తయారు చేశారు. డిజిటల్ పశువుల సంత కు సంక్షిప్త పదమే యనిమాల్ . రైతులు ఆప్ ను తేలిగ్గా ఉపయోగించడానికి వీలయ్యేలా దీన్ని రూపొందిచారు. 


ఆప్ ను ఇంకా అభివృద్ధి చేసేందుకు తమ ఐడియా పట్టుకొని పలు సంస్థల గడపలు తొక్కారు. పాడి పరిశ్రమ రంగంలో వీరు చేస్తున్న కృషి ని గమనించిన సెకోయా లాంటి సంస్థలు 160 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడి దారుల నమ్మకాన్ని వమ్ము కాకుండా ఉండేందుకు మార్కెటింగ్ మీద దృష్టి సారించారు. తరచూ ప్రతి రాష్ట్రంలో చేరోపక్కకీ వెళ్లి పల్లెల్లో పర్యటిస్తూ ఆప్ గురించి రైతులకు తెలియజేసేవారు. ఆప్ వాడకం మీద పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చేందుకు కొన్ని వందల రాత్రులు పల్లెల్లోనే గడిపాము అని చెబుతారు నీతూ, కీర్తిలు.



యనిమాల్ ఆప్ మార్కెట్ లో విడుదలైన  తర్వాత మొదట్లో ఈ యాప్ ద్వారా కేవలం 50 పశువులను మాత్రమే అమ్మగాలిగారు. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని వీరి యాప్ కు మంచి ఆదరణ లభించింది. మొదట్లో ఇంగ్లీషు లో ప్రారంభించారు కానీ తర్వాత హిందీ వెర్షన్ కూడా అభివృద్ధి చేయడంతో ఉత్తర భారతదేశంలో ఇప్పటి వరకు సుమారు 80 లక్షల మంది రైతులు ఈ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2021 చివరి నాటికి యనిమాల్ ద్వారా ప్రతి నెల సుమారు 50 వేల పశువుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఈ అప్ ద్వారా అమ్మకానికి వచ్చే పశువుల్ని వెటర్నరీ డాక్టర్స్ పరీక్షించి వాటికి సెర్టిఫికెట్ ఇప్పించిన తర్వాత నే వాటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెడతారు. 


యనిమాల్  కేవలం పశువుల విక్రయాలకు మాత్రమే పరిమితం కాకుండా పాడి రైతులకు పాల దిగుబడి పెంచే సలహాలు ఇస్తున్నారు. పశువులు కొనేందుకు ఫైనాన్స్ కు సంబంధించిన పలు వివరాలు తెలియజేస్తున్నారు. వీరి సహకారం మరియు ప్రోత్సాహంతో ఉత్తర భారత దేశంలోని పలు గ్రామాల్లో రైతులు డెయిరీ ఫామ్స్ సైతం స్థాపిస్తున్నారు. 



ప్రస్తుతం ఆప్ ద్వారా వార్షిక లావాదేవీల మొత్తం 2500 కోట్లు దాటింది. ఈ ఏడాది నికర ఆదాయం 115 కోట్లకు చేరాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం అని ఈ ఇద్దరు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా యనిమాల్ కార్యకలాపాలు విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


నీతూ , కీర్తి ల కృషిని గుర్తించిన పలు సంస్థలు అవార్డులతో సత్కరించటం జరిగింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించే అత్యంత ప్రభావితం చేసే యువ వ్యాపారవేత్తల జాబితాలోకి వీరికి స్థానం దక్కింది. వీరి కారణంగా ఉత్తర భారతం లో పశువుల క్రయవిక్రయాలలో ఒక పెద్ద విప్లవమే వచ్చింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూనే దేశవ్యాప్తంగా రోజు రోజుకు బలహీనమవుతున్న పాడి పరిశ్రమ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మరో క్షీర విప్లవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నాం అని ఇద్దరు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: