ఒమిక్రాన్‌ : కరోనా టెన్షన్.. ఏప్రిల్‌తో ఖతం..?

దేశంలో కరోనా మూడో వేవ్‌ జోరుగా సాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒమిక్రాన్‌ వేరియంట్ ఎంతగా విజృంభిస్తుందనే అంశంపై అంచనాలు వెలువడుతున్నాయి. అయితే.. ఒమిక్రాన్ విషయంలో పెద్దగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకపోవడం.. చాలా మందిలో అసలు లక్షణాలు లేకపోవడం కాస్త ఊరట ఇస్తోంది. తాజాగా ఊపిరితిత్తులపై ఒమిక్రాన్‌ ప్రభావం తక్కువేనని వైద్య నిపుణలు చెప్పడం కాస్త ఊరట ఇస్తోంది.

ఒమిక్రాన్‌ వేరియంట్ లక్షణాలు ఎగువ శ్వాస కోశ వ్యవస్థకే పరిమితమవుతున్నాయని ప్రముఖ ఆస్పత్రి ఏఐజీ వైద్యులు నాగేశ్వర్‌ రెడ్డి చెబుతున్నారు. చాలా మందిలో ఒమిక్రాన్‌ స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని.. ఒమిక్రాన్ వచ్చిన 95 శాతం మంది 3,4 రోజులకే కోలుకుంటున్నారని నాగేశ్వర్‌ రెడ్డి చెబుతున్నారు. వైరల్‌ స్పైక్‌ ప్రొటిన్‌లో భారీగా ఉత్పరివర్తనాల వల్లే ఒమిక్రాన్‌ అధికంగా  వ్యాప్తి చెందుతోందని.. కరోనా కేసుల లెక్కలు చూసి భయపడాల్సిన పని లేదని నాగేశ్వర్‌ రెడ్డి  అంటున్నారు.

కరోనా మూడో దశలో ఆస్పత్రిలో చేరికలు, మరణాలు తక్కువుగా ఉన్నాయని వైద్యులు  నాగేశ్వర్‌ రెడ్డి వివరించారు. ఒమిక్రాన్‌ ఎంత వేగంగా వ్యాపిస్తుందో.. అంతే వేగంతో తగ్గిపోతుందని.. దీని గురించి ఎక్కువగా ఆందోళన అవసరం లేదని నాగేశ్వర్‌ రెడ్డి వివరిస్తున్నారు.

అంతే కాదు.. అసలు మార్చి నెలాఖరుకు ఈ కరోనా అనేది ఓ సాధారణ జలుబు, దగ్గుగా మారవచ్చుని నాగేశ్వర్‌ రెడ్డి అంచనా వేస్తున్నారు. బూస్టర్‌ డోసు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి స్పైక్‌ ప్రొటిన్‌ నియంత్రిస్తుందని.. వీలైనంత వరకూ బూస్టర్‌ డోసు తీసుకోవడం మంచిదని  నాగేశ్వర్‌ రెడ్డి సూచిస్తున్నారు. అంటే వచ్చే ఏప్రిల్‌ నాటికి ఇండియాలో కరోనా గొడవకు ఫుల్‌ స్టాప్‌ పడుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మూడేళ్ల కరోనా పరేషన్‌కు శుభం కార్డు పడితే అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి. చూద్దాం.. ఏం జరుగుతుందో..?
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: