ఆన్లైన్ షాపింగ్లో పూజా పత్రి కొనుగోళ్లు!
బొజ్జ గణపయ్యను పూజించడానికి 21 రకాల ఆకులు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్లో వాటి కోసం పలు మార్కెట్లు తిరగాల్సి ఉంటుంది. పైగా హైదరాబాద్ వంటి నగరాల్లో అన్ని రకాల పత్రి దొరకడం చాలా కష్టమే అని చెప్పాలి. అయితే ఆన్లైన్లో పూజా పత్రిని విక్రయిస్తున్నారని తెలియడంతో చాలా మంది.. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఆన్లైన్ వేదికగా మట్టి వినాయక విగ్రహాలతోపాటు పత్రిని కూడా విక్రయిస్తున్నారు. దీంతో వినాయక పండుగ వేళ ఆన్లైన్ షాపింగ్కు ఆదరణ పెరిగింది.
పర్యావరణాన్ని పరిరక్షించాలన్న అవగాహన ప్రజల్లోనూ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో మట్టి విగ్రహాలను కొనుగోలు చేసే వారి సంఖ్య అధికమవుతోంది. వివిధ సైజుల్లో మట్టి గణేషుడి విగ్రహాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. 21 రకాల పత్రితో పాటు పూజ సామగ్రి, వినాయకుడి విగ్రహం కలిపి కూడా ఆన్లైన్ ద్వారా అమ్మకాలు సాగుతున్నాయి. అయితే పర్యావరణంపై ప్రజల్లో పెరిగిన అవగాహనను కొందరు క్యాష్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
మొత్తానికి పండుగ వేళ ఎకో ఉత్పత్తులకు డిమాండ్ అయితే పెరుగుతోంది. సంప్రదాయబద్ధంగా పండుగ చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. వినాయక చవితి కోసం అరుదైన ఎకో ఉత్పత్తులు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉండటంతో.. అటు వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. కరోనా భయంతో మార్కెట్కు వెళ్లలేని వారు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.