కరోనా పుణ్యమే : ప్రమాదకర స్థితిలో బాల్యం ?
ఎదిగే పిల్లలపై ప్రమాద ఘటింకలు
కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలు
ఊహించని రీతిలో స్థూల కాయం
ఆట పాటల్లేని కారణంగా తీవ్ర స్థాయిలో ప్రమాదం
ఐదారేళ్ల చిన్నారుల్లారా నను చూస్తే మీకు నవ్వొస్తుందా.. కల్లాకపటం లేని పాపల్లారా నను చూస్తే మీకు నవ్వొస్తుందా అంటాడు ఓ చోట ఓ కవి. పిల్లలు పెద్దలను చూసి హాయిగా నవ్వుకుంటారు. వారి ఆటల్లో ఆట వస్తువుగా మారిపోతారు. పిల్లలు వానకు ఆనం దం అదనంగా అందిస్తారు. పిల్లలు వేసవి వస్తే సంతోషాలు మూటగట్టుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక మళ్లీ కొత్త ఆటలతో కాలం వెచ్చిస్తారు. ఇన్ని చేసే పిల్లలకు కరోనా ఆటంకంగా మారిపోయింది. కొత్త జబ్బులు తెచ్చి పెట్టింది. కొత్త సమస్యలను తెచ్చి పెట్టింది. ఈ దశలో కౌన్సిలింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు తల్లిదండ్రులు.
ఊబకాయ సమస్యతో వీళ్లంతా అవస్థలు పడుతు న్నారు. బడులు లేని కారణంగా ఆటల్లేవు. ఇంట్లో ఉన్నా సరైన గైడెన్స్ వారికి లేదు. కూర్చొని వినే చదువు కొంత సేపే తరువాత వీడియో గేమ్ ప్రపంచంలోకి పోతున్నారు. ఇవన్నీ ఆందోళన దాయకాలే. ఆటల్లేకుండా వికాసం లేదు. అపార్టుమెంట్లలో ఆటలా కుదరని పని. ఇరుకిరుకు గదుల్లో ఆటలా కుదరని పని. కరోనా కారణంగా పిల్లలు స్థూలకాయులు అయిపోయారు. పదకొండేళ్ల లోపు పిల్లలకే ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనాలు తేల్చాయి. తల్లిదండ్రుల ఆందోళనకు ఇప్పుడు పరిష్కారం ఏంటంటే వాళ్లతో వ్యాయామం చేయించడమే అని నిపుణులు చెబుతున్నారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా చదువులు లేవు. బడులు లేవు. ఆన్ లైన్ చదువులు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సరైన సమయం లో పిల్లలకు సరైన వ్యాయమమే లేదు. ఈ దశలో పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. బడికి వెళ్లే దశలో ఇంటికి పరిమితం కావడం, వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం ఇలాంటివన్నీ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొందరిలో మానసికంగా కుంగుబాటు కూడా మొదలయిపోతోంది. వీటితో పాటు తోటి పిల్లల అవహేళనలూ అలానే ఉన్నాయి. ఇలాంటి దశలో పిల్లలను మరింతగా భయాల నుంచి బయటకు తీసుకురావా ల్సింది, నాలుగు మంచి మాటలు చెప్పి ఆందోళనలు పోగొట్టాల్సింది తల్లిదండ్రులే అన్నది సుస్పష్టం. నగరాల్లోనే కాదు మామూలు పట్టణాల్లోనూ ఇదే సమస్య ఉందని గుర్తించారు వైద్యులు. సరిగా గాలి, వెలుతురు లేని గదుల్లో పిల్లలను ఉంచడం, పాఠాలు చెప్ప డం కూడా తగదని, అదేవిధంగా తప్పనిసరిగా స్కూల్స్ లో గేమ్స్ పిరియడ్ ను ఇంప్లిమెంట్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.