కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. కరోనా చేసిన పాపం చిన్న పిల్లల పాలిట శాపంగా మారింది. ఎప్పుడు బయట ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లల్లో కరోనా ప్రభావం బాగానే పడింది. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని పిల్లలు ఇంటికే పరిమితం అయిపోయారు. దీని వల్ల ఫోన్ల వాడకం ఎక్కువైంది. దీంతో వారిలో హ్రస్వ దృష్టి సమస్య రెండు రేట్ల పెరిగిపోయింది. అలాగే ఆన్లైన్ క్లాసులు ఎక్కువవడం ఈ లోపానికి ఒక కారణం కూడా.
కరోనా కారణంగా లాక్డౌన్ విధించాయి ఆయా దేశ ప్రభుత్వాలు. దీంతో ఇంటికే పరిమితమయిన చిన్నారులు ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఫోన్లో చూస్తూ వినెవాళ్లు. ఇదంతా మనకు మామూలుగానే అనిపిస్తోంది. కానీ చిన్నారుల జీవన శైలిలో వచ్చిన ఈ మార్పులు సమస్యలకు మూలం అవుతున్నాయి. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి పిల్లల్లో హ్రస్వ దృష్టి తీవ్రంగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు.
హాంకాంగ్లోని చైనీస్ యూనివర్సిటీ పరిశోధకులు 709 మంది పిల్లలపై అధ్యయనం చేశారు. 2015లో వెయ్యి మంది పిల్లలపై చేసిన ఇదే తరహా అధ్యయనంతో తాజా ఫలితాలను పోల్చి చూస్తే హ్రస్వ దృష్టి పెరిగిపోయిందని తెలిసింది. కరోనా సమయంలో హ్రస్వదృష్టి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జేసన్ యామ్ వెల్లడించారు. జీవనశైలిలోనూ అనేక మార్పులు గమనించినట్లు తెలిపారు ఆయన. బయటకు వెళ్లడం బాగా తగ్గి, ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్ను చూడటం పెరిడం ద్వారా హ్రస్వదృష్టి సమస్య రెట్టింపు అయ్యేందుకు కారణమయ్యాయని తెలిపారు.
అయితే, ఇతర దేశాల్లోని చిన్నారులకూ ఇదే అధ్యయనం వర్తిస్తుందని చెప్పలేమని జేసన్ యామ్పేర్కొన్నారు. ఏం చేయాలి.? ఈ అధ్యయనం ప్రకారం కరోనాకు ముందు సగటు స్క్రీన్ సమయం మూడున్నర గంటలు ఉండేది అదే లాక్డౌన్ టైమ్లో 8 గంటలకు పెరిగిపోయిందట. దీని కారణంగా హాంకాంగ్లోని 40 శాతం మంది పిల్లలకు దృష్టి సంబంధించి సమస్యలు తలెత్తిందని జేసన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిల్లలను బయటి వాతావరణంలో గడిపేలా చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు. చిన్నారులు సగటున వారానికి 14 గంటలు బయటి వాతావరణంలో సమయం వెచ్చించాలని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చదువుకునే సమయంలో ప్రతి 30 నిమిషాలకు మధ్యదూరంగా ఉండే వస్తువులను చూడాలని సూచిస్తున్నారు నిపుణులు.