జాబ్ కొట్టేద్దాం: గ్రూప్1 రాయడం ఇంత తేలికా?
అసలు పరీక్ష ఇబ్బంది అంతా మెయిన్స్ తోనే వస్తుంది.. ఈ మెయిన్స్లో మొత్తం ఆరు సబ్జక్టుల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అందులో ఒక్కోపేపర్కు 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్లో అభ్యర్థి 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు పది మార్కులు చొప్పున 15 ప్రశ్నలకు 150 మార్కులు అన్నమాట. అయితే.. ఇక్కడే వస్తుంది చిక్కు అంతా.. ప్రశ్నాపత్రంలోని 15 ప్రశ్నలకు కేవలం 3 గంటల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది. అంటే.. 180 నిమిషాల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నమాట.
ఇక ప్రశ్నా పత్రంలో మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు అంతర్గత ఛాయిస్ ఉంటుంది. అందువల్ల మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. వీటిని చదవటానికే కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇక రాయడం మొదలు పెడితే.. పది నిమిషాలకు ఒక ప్రశ్న పూర్తయిపోవాల్సిందే. మొత్తం 15 ప్రశ్నలకూ సమాధానం రాసిన వాళ్లకే ఉద్యోగం దక్కే అవకాశం ఉంటుంది.
అందువల్ల ప్రశ్న ఎలాంటిదైనా దానికి ఓ ఫార్మాట్ అంటూ ఉంది. అది తెలుసుకుంటే పది నిమిషాల్లో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయొచ్చు. అదేంటంటే.. దీన్ని నాలుగు C లు అని గుర్తు పెట్టుకోవచ్చు. అవి. కాంటెక్స్ట్, కాన్సెప్ట్, కాన్సీక్వెన్సెస్, కంక్లూజన్.. ఈ నాలుగు అంశాలను ప్రస్తావిస్తూ ఆన్సర్ రాస్తే సమాధానానికి ఓ సమగ్రత వస్తుంది.