బాబోయ్.. దేశంలో కరోనా ఫోర్త్ వేవ్.. ఇవిగో సాక్ష్యాలు?
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల నాలుగో వేవ్ కు సంకేతం అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అవును.. దేశంలో కరోనా కేసులు మరోసారి కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొవిడ్ నాలుగో దశ ముప్పు దిశగా దేశం పయనిస్తోందా అన్న ఆందోళన కూడా కలిగిస్తోంది. ఎందుకంటే.. తాజాగా 4 వేల 270 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అంతే కాదు.. 36 రోజుల తర్వాత రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం కూడా దాటింది.
ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 1.03 శాతానికి చేరుకుంది. కొన్ని రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సంఖ్య ప్రస్తుతం పాతిక వేలకు చేరువలో ఉంది. అయితే.. ఈ కొత్త కేసుల్లో మహారాష్ట్ర నుంచే 1300కుపైగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. జులైలో కరోనా నాలుగోదశ గరిష్ఠస్థాయికి చేరుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్ర అధికారులు కూడా కొవిడ్ నాలుగోదశ ముప్పును తోసిపుచ్చలేమని చెబుతున్నారు. అసలే వర్షాకాలం సమీపిస్తోంది. ఇలాంటి సమయంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అందుకే కొవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను ఇప్పటికే కేంద్రం అలర్ట్ చేసింది.