మోదీ దీదీల మ‌ధ్య పోరు మ‌ళ్లీ షురూ..?

రాజకీయ‌ప‌ర‌మైన వైరుధ్యం వ్య‌క్తిగ‌త వైరంగా ప‌రిణ‌మించ‌డంతో కొంత‌కాలంగా ప్ర‌ధాని మోదీ, బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా విస్త‌రించే ల‌క్ష్యంతో ఉన్న బీజేపీకి బెంగాల్లో మ‌మ‌త గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో బీజేపీ పెద్ద‌ల అహం దెబ్బ తిన్న‌ద‌నే చెప్పాలి. ఆ తరువాత కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం బెంగాల్లో మ‌మ‌త ప్ర‌భుత్వాన్ని ఇబ్బందులు పెట్టాల‌ని చూసినా ఆమె ఏమాత్రం లెక్క చేయ‌లేదు. అంతేకాదు కొంత‌కాలం క్రితం యాస్ తుఫానుకు దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు బెంగాల్‌కు వ‌చ్చిన మోదీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో త‌న‌కోసం ఆయన‌ను వేచి ఉండేలా చేసిన మొండిత‌నం దీదీది. దీంతో ప్ర‌ధానిని బెంగాల్ సీఎం కావాల‌నే అవ‌మానించారంటూ బీజేపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక వీరిద్ద‌రి మ‌ధ్య పోరుకు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల కార‌ణంగా  తాత్కాలికంగానైనా విరామం ప్ర‌క‌టించారనుకుంటున్న స‌మ‌యంలో మ‌రో ర‌కంగా చిచ్చు ర‌గిలింది.


 దేశ రాజ‌ధానిలో ఈ నెల 26న జ‌ర‌గ‌బోయే గ‌ణ‌తంత్ర దిన ఉత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా పాల్గొనే విధంగానే అన్ని రాష్ట్రాల‌కు చెందిన శ‌క‌టాలు పాల్గొన‌బోతున్నాయి. ఈ వేడుక‌ల్లో బెంగాల్ ప్ర‌భుత్వం త‌ర‌పున‌ ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌తిపాదించిన శ‌క‌టాన్ని కేంద్రం తిర‌స్క‌రించ‌డంపై మ‌మ‌త ఇప్పుడు విరుచుకుప‌డుతున్నారు. కేంద్రం నిర్ణయం త‌మ‌కు తీవ్ర ఆవేద‌న‌ను, దిగ్భ్రాంతిని క‌లిగించింద‌ని, ఏవిధ‌మైన కార‌ణం చూప‌కుండానే బెంగాల్ శ‌క‌టాన్ని తిర‌స్క‌రించ‌డ‌మేమిటంటూ ఆమె ఆదివారం ప్ర‌ధాని మోదీకి ఘాటుగా లేఖ రాశారు. దేశం గ‌ర్వించే స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు, జాతీయ నాయ‌కుడు, సుభాష్ చంద్ర‌బోస్ 125 వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌ను, ఆయ‌న స్థాపించిన‌ అజాద్ హింద్ ఫౌజ్ ను స్మ‌రించుకునేలా ఈ శ‌కటం రూపుదిద్దుకున్న‌ట్టు బెంగాల్ టైగ‌ర్ పేర్కొన్నారు. అంతేకాదు దేశ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిగా నిలిచిన మ‌రికొంద‌రు బెంగాల్ ప్ర‌ముఖుల చిత్రాలు ఇందులో ఉన్నాయ‌ని, ఈ శ‌క‌టాన్ని తిరస్క‌రించి మొత్తం బెంగాల్ ప్ర‌జ‌ల‌ను కేంద్రం బాధ‌కు గురి చేసింద‌ని మ‌మ‌త విమ‌ర్శించారు. మొత్తం మీద ఈ అంశాన్ని కూడా రాజ‌కీయంగా ఉప‌యోగించుకోవ‌డం చూశాక మ‌మ‌తతో రాజ‌కీయ పోరాటం అంత తేలిక కాద‌ని బీజేపీ పెద్ద‌ల‌కు అర్థ‌మ‌య్యే ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: