శభాష్ చిత్రం : దేశాన్ని ఏకం చేస్తున్న సినిమాలు..?
అయితే.. మారుతున్న సినీ పరిశ్రమ ఇప్పుడు దేశాన్ని ఏకం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాన్ ఇండియా కల్చర్ ఇప్పుడు దేశాన్ని ఐక్యం చేస్తోంది. గతంలో ఉత్తరాది ప్రేక్షకులు వేరు.. దక్షిణాది ప్రేక్షకులు వేరు.. ఉత్తరాది సినిమాలు వేరు.. దక్షిణాది సినిమాలు వేరు.. ఎప్పుడో ఎవరో ఒకరిద్దరు నటులు, నటీమణులు ఉత్తరాదికి వెళ్లి కొన్ని సినిమాలు చేసేవారు తప్ప.. దేశమంతా ఒకే సినిమా గతంలో ఆడిన దాఖలాలు చాలా తక్కువ. హిందీ సినిమాలు బాగా హిట్ అయినా.. అవి దక్షిణాదిలో డబ్ అయ్యి హిట్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా ఉండేవి.
కానీ ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ కారణంగా.. దక్షిణాది సినిమాలు కూడా ఉత్తరాదిన బాగా ఆడుతున్నాయి. దక్షిణాది నటులు సైతం ఉత్తరాదిన పేరు తెచ్చుకుంటున్నారు. బాహుబలి వంటి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప వంటి పాన్ ఇండియా సినిమా వల్ల అల్లు అర్జున్ సినిమా దేశమంతా ఆడుతోంది. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు ఇప్పుడు దేశమంతటా విడుదల కాబోతున్నాయి.
అంటే ఒకే సినిమా ఇప్పుడు ఒకే సమయంలో ఇండియా అంతటా ఆడబోతోంది. అలా పాన్ ఇండియా సినిమా దేశాన్ని ఏకం చేస్తోంది. ఇలా దేశం మొత్తం ఏక కాలంలో ఒకేలా అనుభూతి చెందించే అవకాశం ప్రస్తుతం సినిమాకు మాత్రమే దక్కుతున్న గౌరవంగా చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో.