అదిగో అతడే బిపిన్ రావత్ వారసుడు.. కానీ.. కొన్ని నెలలే..?
ఈ నేపథ్యంలో భారత త్రివిధ దళాలకూ కలిపి ఓ చీఫ్ ఉండాలన్న ప్రతిపాదన వచ్చింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాకే ఈ ప్రతిపాదన వచ్చింది. చివరకు ఆ ప్రతిపాదన కార్య రూపం దాల్చి బిపిన్ రావత్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎంపికయ్యారు. అయితే అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కొద్దికాలానికే మరణించారు. ఇప్పుడు ఆ పదవికి కొత్త వ్యక్తి ఎంపిక పని మొదలైంది. తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వారసుడిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
అయితే ఈ కసరత్తు అంత సులభమేమీ కాదు. దీనికి చాలా ప్రక్రియ ఉంటుంది. ముందు త్రివిధ దళాలు అతి త్వరలోనే పలువురు పేర్లతో కూడిన జాబితాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం కోసం సమర్పించే అవకాశం ఉంది. రావత్ వారసుడి కోసం త్రివిధ దళాలకు చెందిన సీనియర్ కమాండర్లతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయబోతోంది. ఈ కమిటీ ఇచ్చే సిఫారసుల మేరకు తుది జాబితాను ఖరారు చేస్తారు. దాన్ని రక్షణ మంత్రి ఆమోదం కోసం త్వరలో పంపిస్తారు. ఆ తర్వాత సీడీఎస్ పేరు ఖరారు చేసేందుకు ఆ జాబితాను నియామకాల కేబినెట్ కమిటీకి పంపిస్తారు.
అయితే.. సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవణె సీడీఎస్గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్రివిధ దళాధిపతుల్లో ఆయనే సీనియర్. అయితే ఆయన 2022 ఏప్రిల్లోనే రిటైర్ కాబోతున్నారు. ఆయన్ను ఎంపిక చేస్తే మళ్లీ కొన్ని నెలల్లోనే కొత్త సీడీఎస్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆయన తర్వాత రేసులో సైనిక దళాల ఉపఅధికారి లెఫ్టినెంట్ జనరల్ మొహంతి, ఉత్తర సైనిక కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జోషి ఆర్మీ చీఫ్ రేసులో ఉన్నారు.