లక్ష కోట్ల ప్రశ్న: ఏపీ రాజధాని ఏది..?
అన్నింటి కంటే.. కష్టమైన ప్రశ్న కోటి రూపాయల ప్రశ్నగా నిలుస్తుంటుంది.. అయితే.. ఇప్పుడు ఏపీ రాజధాని అంశం హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఏపీ రాజధాని ఏదన్న ప్రశ్న ఏకంగా లక్ష కోట్ల రూపాయల ప్రశ్న అంటూ సెటైర్లు మొదలయ్యాయి. చెప్పుకోవడానికి కాస్త కామెడీగా అనిపిస్తున్నా.. ఇది చాలా చేదు వాస్తవం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే ఇప్పటికిప్పుడు సమాధానం కోసం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.. ఈ ప్రశ్నకు 2014 ముందు వరకూ ఒకే సమాధానం ఉండేది అదే హైదరాబాద్.
మరి ఇప్పుడు.. 2014 తర్వాత అమరావతి రాజధానిగా వచ్చేసింది. అప్పటి సీఎం చంద్రబాబు దాన్ని ఏపీ రాజధానిగా చేశారు. ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు హాలీవుడ్ గ్రాఫిక్స్ ను తలదన్నే రీతిలో సినిమా చూపించారు. కానీ కనీసం ట్రైలర్ రేంజ్లో కూడా తన ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మించలేకపోయారు. దీంతో.. అమరావతి అన్నది రూపుదిద్దుకోలేకపోయింది. 2019లో జగన్ సీఎంగా రావడంతో అమరావతి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.
అమరావతిని అభివృద్ధి చేస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే వెళ్తుందని భావించారో.. లేక రాజకీయంగా అమరావతి రాజధాని తనకు అనుకూలం కాదనుకున్నారో ఏమో కానీ.. జగన్ సీఎం అయినప్పటి నుంచి మూడు రాజధానుల పాట అందుకున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామంటున్నారు. మరి ఇప్పటికిప్పుడు ఏపీ రాజధాని ఏది అంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి.