ఏపీ పాలిటిక్స్: యథా రాజా తథా ప్రజా!?
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో చేపట్టిన వైసీపీ జనాగ్రహ దీక్షలో కుప్పం రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ వీరావేశంతో ఊగిపోయారు. ఏకంగా చంద్రబాబుపైనే ఆయన అసభ్య పదజాలంతో మండిపడ్డారు. "దమ్ముంటే రా.." "నీ కారు మీద బాంబు వేస్తా.." అంటూ పూనకం వచ్చినవాడిలా మాట్లాడారు. దీంతో కుప్పంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేసేందుకు రోడ్డెక్కారు. వారిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీల వారిని అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. చివరకు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
ఇక విశాఖలో రెండు చోట్ల వైసీపీ జనాగ్రహ దీక్షల్లో పాల్గొన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సైతం బూతులతో రెచ్చిపోయారు. సీఎం జగన్ నోట వచ్చిన మాటను పలుమార్లు వల్లిస్తూ.. టీడీపీ నేత పట్టాభి రామ్ను తిట్టిపోశారు. అలాగే చంద్రబాబుపైనా తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి, ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గతంలో ఎన్నడూ లేనివిధంగా మాట్లాడటం విశాఖ వాసులను నివ్వెరపరిచేలా చేసింది.
అలాగే కృష్ణా జిల్లా నూజివీడులో జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు కూడా ఆవేశంతో రగిలిపోయారు. పూనకం వచ్చినట్లుగా మాట్లాడారు. పట్టాభి ఖబడ్దార్, బద్మాష్ అంటూ అసభ్య పదజాలంతో మండిపడ్డారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు జరిగిన వైసీపీ జనాగ్రహ దీక్షల్లో పలువురు నేతలు బూతు మాటలతో రెచ్చిపోవడం కనిపించింది. దీంతో అనరాని మాట సీఎం జగన్ నోట రావడంతోనే.. అదేమీ పెద్ద తప్పు మాట కాదన్నట్లుగా వైసీపీ నేతలు కూడా ఆ బూతు పదాన్ని విరివిగా వాడారన్న చర్చ జరుగుతోంది.