పీక్ అవర్ లో డిమాండ్ దృష్ట్యా విద్యుత్ అమ్మకానికి తెలంగాణ బాస్ కేసీఆర్ నిర్ణయించి రెండు రోజుల వ్యవధిలోనే 49 మిలియన్ యూనిట్లు అమ్మేశారని తెలుస్తోంది. యూనిట్ ధర ఇరవై రూపాయలుగా నిర్ణయించి మరీ! అమ్మి ఖజానాకు నిధులు చేకూర్చార ని కూడా తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా ముందున్న కాలంలోనూ తెలంగాణ మిగులు విద్యుత్ ను అమ్ముకునేందుకు ప్రాధా న్యం ఇవ్వనుంది. ఇదే సమయంలో ఏపీ మాత్రం విద్యుత్ ఉత్పత్తిలోనూ, పంపిణీలోనూ వెనుకబడిపోతోంది. ఒకప్పుడు రాష్ట్రం విడిపోతే విద్యుత్ కోతలు తెలంగాణకే అధికం అని భయపెట్టారు కొందరు సమైక్య పాలకులు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే సీఎం కూడా ఇదే చెప్పాడు. ఆ మాట రాష్ట్రం విడిపోయాక కొంత కాలం తెలంగాణ విషయమై నిజమైనప్పటికీ ఇప్పుడు మాత్రం అవేవీ లేవనే తేలిపోయింది. తొలినాళ్లలో అంటే రాష్ట్రం విడిపోయాక ఏపీ నుంచే విద్యుత్ తెలంగాణ తప్పనిసరై తీసుకుంది. కానీ సంబంధిత బిల్లులు మాత్రం చెల్లించలేదు. ఈ బకాయిలు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఓ సమాచారం. దీనిపై బాబు కానీ జగన్ కానీ అడగలేదు. ఇక అడగరు కూడా! పోనీ మిగులు విద్యుత్ ను ఉదారతతో తక్కువ రేటుకే తెలంగాణ రాష్ట్రం మనకు అందిస్తుందా అంటే అదీ లేదు అని తెలుస్తోంది. సో.. విద్యుత్ విషయమై కేసీఆర్ గెలిచాడు. జగన్ ఓడిపోయాడు. ఇదే సమస్య రేపటి వేళ ఆయన అధికారానికి కూడా గండీ కొట్టవచ్చు.
విద్యుత్ కొనుగోలు అమ్మకంకు సంబంధించి చాలా వివాదాలు రేగుతున్న సమయాన కేసీఆర్ మాత్రం తనదైన పంథాలో తన పని తాను చేసుకుని పోతున్నారు. మిగులు విద్యుత్ ను అమ్ముకుంటూ తన రాష్ట్ర ఖజానాకు నాలుగు కాసులు చేరవేస్తున్నారు. దీంతో తెలంగాణ చేస్తున్న పనిపై కేంద్రం మండిపడుతోంది. ప్రస్తుతం సంక్షోభం ఉన్న తరుణాన విద్యుత్ ను అవసరాల మేరకు వాడుకుని, మిగులు విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలని, దీనిని మానవతా దృక్పథంలో భాగంగా పరిగణించి అమలు చేయాలని అంటున్నారు. అదేవిధంగా కేంద్రం చెప్పనిదే విద్యుత్ అమ్మకాలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని అంటోంది. కానీ సెంట్రల్ పవర్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చే విద్యుత్ విషయాన్నే పరిగణనలోకి తీసుకోవాలని, అంతేకానీ రాష్ట్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్ వాడకం, అమ్మకం అన్న వాటిపై అధికారం కేంద్రానికి ఉండదని కూడా తేల్చి చెబుతోంది తెలంగాణ. దీంతో కేంద్రం, రాష్ట్రం మధ్య దూరం పెరిగిపోయినా సంబంధ బాంధవ్యాలు చెదిరిపోయినా కూడా తగ్గేదేలే అంటోంది తెలంగాణ.