శ్రీకాకుళం టాక్స్ : స్పీకర్ పదవికి ధర్మాన నో!
శ్రీకాకుళం రాజకీయాలలో తనకంటూ ఓ వర్గం తనదైన శైలి..తనదైన వాక్ చాతుర్యం ఉన్న నేత ధర్మాన ప్రసాదరావు. ఆయన ఏ పార్టీలో ఉన్నా లేదా నిశ్శబ్దం అయిపోయినా ఆయన వెంటే ఆయన మాటే శాసనంగా నడిచిన కార్యకర్తలు ఈనాటికీ ఉన్నారు. ఆయన కారణంగా ఎదిగిన నేతలు, ఆయన పేరు చెప్పి ఎన్నో మంచి పదవులు అందుకున్నవారు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి పాలన లో ఆయన రెండో స్థానంలో ఉన్న మంత్రి. తెలంగాణ, ఆంధ్రా నాయకులందరికీ సుపరిచిత వ్యక్తి. రెవెన్యూ వ్యవహారాలు, చట్టాలపై గొప్ప అవగాహన ఉన్న మంత్రి. రాజశేఖర్ రెడ్డి విధేయుల్లో ఆయన మాటను జవదాటని నేతల్లో ఆ రోజు ధర్మాన ఒకరు. ఆయనకు తోడు గా బొత్స అన్నది ఇప్పటికీ ఎవ్వరూ మార్చలేని సత్యం. ముఖ్యంగా వ్యవహార శైలి.. చదువుకున్న వారిని గౌరవించే లక్షణం.. ఒక వార్తను అర్థం చేసుకునే రీతి.. ఇవన్నీ ఆయనకు అదనపు గౌరవాన్ని తెచ్చి పెట్టాయి అనడం ఏ మాత్రం సందేహం లేదు. ప్రాజెక్టుల పై గొప్ప అవగాహన ఉన్న నేతగా రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి హయాం వరకూ పేరు తెచ్చుకున్నారు. సరిహద్దు వివాదాలు ముఖ్యంగా జల వివాదాలు పరిష్కరించడంలో, వాటిపై కోర్టు వివాదాలు నెలకొంటే వాటిని అర్థం చేసుకుని ప్రజలకు వివరించడంలో ఆయన ఎప్పటికీ ముందు వరుసలో ఉన్న నేత అని చెప్పడం అతిశయం కాదు. కాల క్రమంలో కొన్ని వివాదాల నేపథ్యంలో ఆయన కాస్త వెనక్కు తగ్గారు అన్న మాట వాస్తవమే అయినా క్యాబినెట్ లో ఆయనకు చోటు దక్కనుందా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. ధర్మాన అనుచరులు మాత్రం మంత్రి పదవి వస్తే ఒకనాటి ప్రాభవాన్ని పొందిన నేతగా తాము ఇంకాస్త ఆనందిస్తామే చెబుతున్నారు.