ఆంధ్రాలో అడ్రస్ లేని చంద్రబాబు.. లోకేశ్..?
చంద్రబాబుకు మొదటి నుంచి హైదరాబాద్లో ఇల్లు ఉంది. ఆ తర్వాత ఆయన 2014లో ఏపీకి సీఎంగా ఉన్న కాలంలోనే పాత ఇంటిని కూల్చి వేయించి మరీ కొత్త భవనం కట్టించుకున్నారు. ఆ ఇల్లు కూల్చిన సమయంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఓ హోటల్లోనూ ఉన్నారు.. అదీ సర్కారు సొమ్ముతో. ఏపీకి సీఎం అయిన తర్వాత కూడా ఆయన రాజధాని ప్రాంతంలో ఓ సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన చేయలేదు. ఏపీ విడిపోగానే పార్టీ కోసం మంగళగిరిలో పార్టీ కోసం అత్యాధునిక భవనం కట్టించిన చంద్రబాబు.. తన కోసం మాత్రం ఇల్లు కట్టుకోలేదు. లింగమనేని గెస్ట్ హౌజ్నే నివాసంగా మలచుకున్నారు.
అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి వైసీపీ అధినేత జగన్ది. ఆయనకూ హైదరాబాద్లో లంకంత నివాసం ఉంది. అయినా.. ఏపీ విడిపోగానే ఆయన తాడేపల్లిలో తనకంటూ ఓ నివాసం నిర్మించుకున్నారు. ఇప్పుడు ఏపీ సీఎంగా అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. విపక్ష నేత కూడా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నా.. అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం సొంతింటి వైపు చూడలేదు.
ఇదే ఇప్పుడు వైసీపీ విమర్శలకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ చంద్రబాబు, లోకేశ్లకు ఏపీలో సొంత అడ్రస్ లేదని తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మరి.. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నా.. మరి సొంత చిరునామా కోసం ఎందుకు ప్రయత్నించడం లేదో.. ఈ విమర్శలను ఎందుకు భరిస్తున్నట్టో..?