JNTUA: 30 బీటెక్ కాలేజీల గుర్తింపు రద్దు?

Purushottham Vinay
అనంతపురంకి చెందిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం  (జేఎన్‌టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్‌ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్‌ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్‌ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్‌ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు.జేఎన్‌టీయూఏ పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022-23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు.


తక్కిన 30 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు.2022-23 విద్యా సంవత్సరంలో జేఎన్‌టీయూఏ పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్‌ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా-డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్‌ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్‌టీయూఏ ఈ మేరకు నివేదించింది.కంప్యూటర్‌ సైన్సెస్‌తో కంప్యూటర్‌ సైన్సెస్‌ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్‌ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్‌ సైన్సెస్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్‌ సైన్సెస్‌ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: