కేసీఆర్.. కొలువుల జాతరా.. కొలువుల దందానా?
ఈ సమావేశానికి AIYF, DYFI, AISF, PDSU వంటి విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. వీరితో పాటు... ఎస్. ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు అంటున్నాయి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్ ఐ. కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో చెలాగాటమాడుతున్నదని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటన అంటూ కేసీఆర్ సర్కారు నిరుద్యోగులకు నష్టం చేసే విధి విధానాలను అమలు చేస్తున్నారని వామపక్ష విద్యార్థి సంఘాలు అంటున్నాయి. యువతకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అశాస్త్రీయ విధానాలతో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ వ్యవహరిస్తున్నదని... దీని కారణంగానే అభ్యర్థులు పోరాటం చేస్తున్నారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సమీక్ష చేసి సమస్యను పరిష్కరించాల్సిన గురుతర బాధ్యత ను మరచి చోద్యం చూడటం సిగ్గుచేటని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా.. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితిని వామపక్ష విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేశాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను పలు తీర్మానాల రూపంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఆమోదించాయి. ఇవాళ అన్ని జిల్లాలలో మీడియా సమావేశాలు.. జనవరి 6వ తేదీన హైదరాబాద్ లో రాష్ట్ర సదస్సులు, 7వ తేదీన దున్నపోతులకు వినతిపత్ర ఇచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, 10వ తేదీన హైదరాబాద్ లోని మంత్రుల కార్యాలయాల ముట్టడి నిర్వహించనున్నారు.