మోదీకి ఈ కేసు మరోసారి తలనొప్పిగా మారనుందా?

బిల్కిస్  బానో అత్యాచారం కేసు.. ఇప్పుడు ఈ కేసు మరోసారి మోదీ సర్కారుకు గుదిబండగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను గుజరాత్  ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడంపై బాధితురాలు బిల్కిస్  బానో మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో దోషులకు  రెమిషన్  పాలసీని అమలు చేసేందుకు గుజరాత్  ప్రభుత్వానికి గతంలో సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఉత్తర్వులను మళ్లీ సమీక్షించాలని కోరుతూ తాజాగా బిల్కిస్  బానో సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్  వేశారు.

ఈ పిటిషన్ ను సీజేఐ జస్టిస్  చంద్రచూడ్  నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దోషుల విడుదలపై గతంలో దాఖలైన పిటిషన్ తో కలిపి దీన్ని విచారించొచ్చా లేదా అన్నది పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్  చంద్రచూడ్  నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిల్కిస్  బానో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

అసుల ఇంతకూ ఈ బిల్కిస్‌ బానో కేసు ఏమిటి.. దీని పూర్వాపరాలు పరిశీలిస్తే.. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్ లో అల్లర్లు జరిగాయి. అప్పుడే  ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్  బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ బానో రేప్‌ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008లోనే జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది కూడా. అంతే కాదు.. దోషులు 15ఏళ్లు కారాగారంలోనూ గడిపారు. అయితే.. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేళ గుజరాత్  ప్రభుత్వం ఈ దోషులను విడుదల చేసింది. ఇలా అత్యాచార దోషులను విడుదల చేయడాన్ని  రాజకీయ పార్టీలు, అనేక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వీరి విడుదలను సవాల్  చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్  దాఖలైంది. మరి ఈ కేసు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: