ఆ విషయంలో చైనాను చిరాకుపెడుతున్న అమెరికా?
ఇటీవలే చైనా వద్దని హెచ్చరిస్తున్నా వినకుండా.. అమెరికా దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించారు. ఇది చైనాకు చిర్రెత్తేలా చేసింది. ఆ ఘటన మరచిపోక ముందే.. ఇప్పుడు అమెరికా మరోసారి చైనాకు కోపం తెప్పిస్తోంది. నాన్సీ పెలోసీ పర్యటన జరిగిన కొద్ది రోజులకే మరో అమెరికా ప్రజాప్రతినిధుల బృందం తైవాన్లో పర్యటించబోతోంది. అమెరికాలోని డెమొక్రటిక్ సెనెటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం రెండు రోజులపాటు తైవాన్లో పర్యటించబోతోంది.
డెమొక్రటిక్ సెనెటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం.. అమెరికా- తైవాన్ సంబంధాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చిస్తాయి. ఈ విషయాన్ని తైవాన్లోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. డెమొక్రటిక్ సెనెటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం పర్యటన ప్రకటనను తైవాన్ స్వాగతించింది. తైపీ, వాషింగ్టన్ల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ఈ బృందం పర్యటన మరో సంకేతమని తైవాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
తైవాన్లో నాన్సీ పెలోని పర్యటన తర్వాత చైనా తైవాన్ పై మరింతగా దూకుడు పెంచింది. ఆ దేశం సమీపంలోని సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు చేస్తోంది. క్షిపణి ప్రయోగాలు చేస్తూ తైవాన్ దేశాన్ని హడలెత్తిస్తోంది. ఇలాంటి సమయంలో.. చైనా ఉద్రిక్తతలు కొనసాగుతోన్నా.. అమెరికా కాంగ్రెస్ మరో పర్యటనను ఏర్పాటు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.