మిస్టరీ: ఆ మరణంపై సీబీఐ విచారణ చేయించాల్సిందేనా?
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ మరణం ఆంధ్రప్రదేశ్లోని ఒక వర్గం పోలీసుల క్రూరమైన పనితీరుకు నిదర్శనమని చంద్రబాబు అంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారి ప్రోద్భలంతో పోలీసులు విచారణ పేరుతో నారాయణను జూన్ 17 కస్టడీకి తీసుకుని చిత్ర హింసలకు గురి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. 19 జూన్ 2022న, నారాయణ అనుమానాస్పద స్థితిలో తన గ్రామ శివార్లలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడని... తనను కస్టడీలో తీవ్రంగా హింసించారని నారాయణ తన కుటుంబ సభ్యులకు ముందుగానే తెలిపాడని చంద్రబాబు అంటున్నారు.
నారాయణ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో కూడా పేర్కొన్నారని చంద్రబాబు తెలిపారు. విచారణ పేరుతో నారాయణను అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అతని మరణానికి కారణమయ్యారని చంద్రబాబు విమర్శించారు. పోస్ట్ మార్టం అనంతరం నారాయణ మృతదేహాన్ని కుటుంబ ఆచారాలకు అనుగుణంగా ఖననం చేయనీయలేదని.. చంద్రబాబు అన్నారు.
అంతే కాదు.. నారాయణ మృతి కేసులో తదుపరి విచారణ వద్దని ఆయన కుటుంబ సభ్యులను పోలీసు అధికారులు బెదిరిస్తున్నారని కూడా చంద్రబాబు ఆరోపించారు. నారాయణ మృతి ఘటనలో పొదలకూరు పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నారాయణ పోస్ట్మార్టం నివేదికను బహిరంగపరచాలని.. నారాయణ కుటుంబానికి 50 లక్షలు ఆర్ధిక సాయం అదించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.