కొత్త రాష్ట్రపతి ముర్మూ.. ఎవరో తెలుసా?

ద్రౌపది ముర్మూ.. ఇప్పుడు దేశమంతా ఒక్కసారిగా మారుమోగుతున్న పేరు.. భారత కొత్త రాష్ట్రపతిగా ఆమె ఎన్నిక దాదాపు ఖారారైంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతోంది. ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న రాత్రి ప్రకటించారు. నిన్న రాత్రి 7.30 గంటల నుంచి 9.15 వరకు జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు ఈ మథనంలో పాల్గొన్నారు.

ఎందరో నేతల పేర్లు పరిశీలించి చివరకు ద్రౌపది ముర్మూకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. మరి ఇంతకీ ఈ ద్రౌపది ముర్మూ ఎవరు..? ద్రౌపది ముర్మూ గతంలో ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేశారు. 1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించారు. సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్మూ గతంలో ఒడిశా మంత్రిగా వ్యవహరించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కుమారులిద్దరూ చనిపోయారు.

భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న ముర్మూ.. నీటి పారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ 1979-1983 మధ్య కాలంలో పని చేశారు. ఆ తర్వాత గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌గా శ్రీఅరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో పని చేశారు. 1997 బీజేపీలో చేరిన ద్రౌపది ముర్ము.. అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. 1997లో రాయ్‌రంగ్‌పుర్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై.. వైస్‌ ఛైర్మన్‌గానూ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2000లో రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000-2002 మధ్య కాలంలో బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు.

ఆ తర్వాత 2002-2004లోనూ మంత్రిగా పని చేశారు. 2004లో మరోసారి రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. 2002-2009 మధ్య కాలంలో మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారు. 2006-2009 మధ్య కాలంలో ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా.. 2010లో మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2015లో ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: