ఆ మాఫియాను అడ్డుకోండి.. స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ?

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారు. ఇదేదో రాజకీయ పరమైందో.. పొత్తుల కోసమో.. రాజకీయ ఎత్తుల కోసమో అనుకుంటున్నారా.. అదేమీ కాదు.. తమిళనాడు పీడీఎస్ బియ్యం తో ఏపీ రేషన్ రైస్ మాఫియా చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందని స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ ద్వారా తెలియజేశారు. ఏయే రూట్లల్లో రేషన్‌ రైస్‌ మాఫియా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తోందనే విషయాన్ని చంద్రబాబు తన  లేఖలో  వివరంగా ప్రస్తావించారు.

స్టాలిన్‌కు రాసిన లేఖలో చంద్రబాబు కొన్ని ఫోటోలను కూడా జత చేశారు. స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు చంద్రబాబు జత చేశారు. తమిళనాడులో పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యం ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల మీదుగా ఏపీకి తరలి వస్తోందని చంద్రబాబు తన లేఖలో స్టాలిన్‌కు వివరించారు. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా ఈ  మాఫియా బియ్యం తరలిస్తోందట.

ఆంధ్రా- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతోనే ఇలా రైస్ మాఫియా రెచ్చిపోతోందని చంద్రబాబు అంటున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి రైస్ మాఫియాకు పంపి బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చంద్రబాబు వివరించారు. ఇక్కడి నుంచి కొంత మొత్తం కర్ణాటకకు కూడా అక్రమంగా తరలిపోతోందని చంద్రబాబు తెలిపారు.

ఈ బియ్యాన్ని మాఫియా నుంచి కొందరు తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో కిలో 40 రూపాయలకు అమ్ముతున్నారని చంద్రబాబు వివరించారు. ఈ పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతోదని .. దీన్ని అరికట్టాలని చంద్రబాబు స్టాలిన్‌ను కోరుతూ లేఖ రాశారు. తమిళనాడు – ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర సరిహద్దుల్లో  నిఘా పెంచి అక్రమ రవాణాను అడ్డుకోవాలని చంద్రబాబు స్టాలిన్‌ను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: