కేసీఆర్ నిర్ణయంతో.. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌?

హైదరాబాద్‌ ఇప్పుడు మరింత విస్తరించబోతోందా.. ఇప్పడు ఉన్న హైదరాబాద్ నగరానికి దాదాపు అంతే పరిమాణం ఉన్న మరో మహానగరం అక్కడ వెలవబోతోందా.. ఈ దెబ్బతో అక్కడ రియల్ ఎస్టేట్‌ బూమ్ మరోసారి ఊపిందుకోబోతోందా.. అంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ ఎక్కడ ఈ రియల్ ఎస్టేట్ బూమ్ అంటారా.. అదే జీవో 111 ప్రభావంతో ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్‌ ఊపందుకోబోతోంది. ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల కారణంగా వీటి చుట్టూ పది కిలోమీటర్ల వరకూ ఇన్నాళ్లూ జీవో 111 ఆంక్షలు ఉండేవి.

ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆంక్షలు ఎత్తేసింది. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ 26 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెర వేరింది. ఇప్పటివరకు ఇక్కడ జీ+2 నిర్మాణాలకే అధికారులు అనుమతిస్తున్నారు. అది కూడా అనధికారికంగానే. అది కూడా కేవలం గ్రామ కంఠం పరిధిలో నిర్మించుకుంటేనే ఈ అవకాశం ఉండేది. అందువల్ల ఆ ప్రాంతం అంతా అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. కేవలం ఆయా గ్రామాల వారే అక్కడ ఇళ్లు కట్టుకునే వారు.  కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ 84 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు జోరందుకునే అవకాశం వచ్చింది.

ఇప్పుడు ఆంక్షల ఎత్తివేతతో ఈ 84 గ్రామాల్లో భారీ అభివృద్ధి జరిగే అవకాశం వచ్చేసింది. రెసిడెన్షియల్‌ విల్లాలు, భారీ అపార్టుమెంట్లూ ఈ ప్రాంతాల్లో రాబోతున్నాయి. ఇకపై  హోటళ్లు, విలాస కార్యకలాపాలు కూడా బాగా జోరందుకోబోతున్నాయి. కేసీఆర్‌ జీవో 111ను ఎత్తివేస్తామని గత నెలలో చెప్పారు. అప్పటి నుంచి ఇక్కడ రియల్ బూమ్ మొదలైంది. ఇక ఇప్పుడు నిబంధనల ఎత్తివేతతో అది మరింత జోరందుకునే అవకాశం వచ్చేసింది. ప్రస్తుతం మెయినాబాద్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల్లో కాస్త రోడ్డుకు సమీపంలో ఉన్న భూమి ఎకరా రూ.4 నుంచి 10 కోట్ల మధ్య ధర ఉంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఈ రేట్లు డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: