జూలై 23 ముహూర్తం ఎవరికి..? విజయసాయి ట్వీట్ సంచలనం..
ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది అంటూవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా టీడీపీని ఉద్దేశించి చేసిన వార్నింగ్తో కూడిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. "23 వతేదీ టీడీపీకి కాళరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. ఇప్పుడు జూలై 23వ తేదీ శుక్రవారం వస్తోంది. ఆ రోజుతో టీడీపీ పటాపంచలేనా..?" అని విజయసాయి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డికి ఢిల్లీ పెద్దల వద్ద ఉన్న పలుకుబడి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చూస్తే టీడీపీ పెద్దలు గతంలో చేసిన అవకతవకలకు సంబంధించి ఆధారాలేమైనా దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నాయా..? జూలై 23న దీనికి సంబంధించి సంచలన పరిణామం ఏదైనా జరగబోతోందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. టీడీపీకి చెందిన కీలక నేతలను వైసీపీ ప్రభుత్వం సరిగ్గా శుక్రవారం లేదా.. 23వ తేదీ చూసుకుని మరీ అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాగే ఈఎస్ఐ స్కామ్లో అచ్చెంనాయుడును గతేడాది జూన్ 12, శుక్రవారం అరెస్ట్ చేసింది. ఆ తర్వాత హత్య కేసులో కొల్లు రవీంద్రను జులై 3, శుక్రవారం రోజే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను కూడా ఏప్రిల్ 23, శుక్రవారం రోజునే అరెస్ట్ చేశారు. అంతే కాదు.. ఆ మధ్య చంద్రబాబుకు నోటీసులు ఇస్తూ.. 23వ తేదీనే విచారణకు రావాలని ఏపీ సీఐడీ కోరింది. దీంతో 23 లేదా శుక్రవారం పేరు వింటేనే రాష్ట్రంలో టీడీపీ నేతలు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. మరి విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చెప్పినట్టుగా జూలై 23 శుక్రవారం జరగబోయే సంచలనమేంటో చూడాలిమరి.