ఛీఛీ.. చైనా : ప్రపంచానికంతా కరోనా అంటించి.. ఇప్పుడు నంగనాచి కబుర్లు..?
కరోనా విషయంలో చైనా అనుసరించిన వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా వచ్చాయి. ఇక అమెరికా అయితే చైనాపై దుమ్మెత్తిపోస్తోంది. ఇప్పటికీ ట్రంప్ కరోనాను చైనా వైరస్ అనే అంటుంటారు కూడా. అలాంటి చైనా ఇప్పుడు ఏమంటోందో తెలుసా.. కరోనా విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించిందట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగే. కరోనా వైరస్పై చైనా పారదర్శకంగానే వ్యవహరించిందని జిన్పింగ్ మరోసారి నంగనాచి కబుర్లు చెప్పారు.
చైనాలో కరోనా వైరస్పై పోరాట సమయంలో కీలక పాత్ర పోషించిన వారిని అభినందిస్తూ బీజింగ్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కరోనా వైరస్ విషయంలో చైనా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిందని చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో మొదట సానుకూల వృద్ధిరేటు పొందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థ కూడా చైనాయే అంటూ జబ్బలు చరుచుకున్నారు జిన్ పింగ్.
జిన్ పింగ్ వైఖరి చూస్తుంటే.. ప్రపంచం అంతా చీదరించుకుంటున్నా.. నా దారి నాదే అన్నట్టుంది. అవును మరి అలా సమర్థించుకోకపోతే.. ప్రపంచం అంతా ఏకమై ఏదో ఒకనాడు చైనాను వెలివేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చైనా తన నిర్లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కోట్ల మంది జీవితాలతో ఆడుకుంది. లక్షల కోట్ల రూపాయలు వృథా అయ్యేలా చేసింది. పైగా ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతూ.. నేనింతే అంటూ బరితెగించి మాట్లాడుతోంది.