అదీ లాజిక్కు: బాబు జగన్ను తిడితే మోదీని కూడా తిట్టినట్టేగా?
అయితే జగన్ హయాంలో అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేశారని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు అని ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఆరోపిస్తూ వస్తున్నారు. అసలే ఎన్నికల కాలం కావడంతో ఎల్లో మీడియా వీటిని మరింత హైలెట్ చేసి.. ప్రచారం చేస్తోంది.
ఇటీవల కేంద్ర మంత్రులు ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏపీ అప్పుల ప్రస్తావన తీసుకు వచ్చారు. అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు.. కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రుణాలు తీసుకుందా? రాష్ట్ర బడ్జెట్.. అప్పులు.. రాబడి, వ్యయాలు ఇవన్నీ నరేంద్ర మోదీకి తెలియనివ్వకుండా జగన్ అప్పులు తీసుకువస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చేది మీరే.. విమర్శించేది మీరేనా అని అడుగుతున్నారు.
మరోవైపు ఎఫ్ఆర్బీ పరిమితులకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకువస్తుంది అనే విషయం కేంద్ర మంత్రులకు తెలిసినా.. విమర్శిస్తున్నారంటే ఇది రాజకీయ లబ్ధి కోసం తప్ప మరేది లేదని విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అప్పు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే అప్పు తీసుకోవడం తప్పేం కాదని.. ఎంత ధనిక రాష్ట్రమైనా అప్పులు చేసి.. వాటిని తీర్చుతూ ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని చెబుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతే కేంద్రమే నిధులు రాకుండా మోకాలు అడ్డు వేస్తుందని చెబుతున్నారు. వాస్తవంగా లెక్కలు చూసుకున్నా కూడా చంద్రబాబు కన్నా.. జగన్ తక్కువ అప్పులు చేశారని రాష్ట్ర లెక్కలు చెబుతున్నాయి.