భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో 13 మంది మృతి

N ANJANEYULU
నాగాలాండ్లో దారుణమైన ఘటన చోటు చేసుకున్న‌ది. మిలిటెంట్లుగా భావించి పౌరులపై భద్రతా బలగాలు  కాల్పులు జ‌ర‌ప‌డంతో  13 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాల పాలై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు.

బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జ‌రిపారు.  కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలోనే  మిలిటెంట్ల కదలికలున్నట్లు సైన్యానికి సమాచారం వ‌చ్చిన‌ది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన బలగాలు కార్మికుల‌ను మిలిటెంట్లు అనుకొని అక‌స్మాత్తుగా కాల్పులు జరిపాయి. అయితే ఈ కాల్పుల్లో పౌరులే ప్రాణాలు కోల్పోవడం  గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.
ఈ  పరిణామంతో జిల్లాలోని ఓటింగ్ ప్రాంతంలో ఉద్రిక్త  వాతావ‌ర‌ణ పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. బలగాల వాహనాలను తగులబెట్టారని బలగాల పొరపాటు కార‌ణంగానే ఘటన జరిగిందనే  కోణంలో దర్యాప్తు కొన‌సాగుతుంది అని అధికారులు  తెలిపారు.  ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు అక్క‌డి అధికారులు.
ఈ ఘటనపై ఆర్మీ విచారణకు కూడా ఆదేశించిన‌ది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నిర్వహించనున్నట్టు సైన్యం స్పష్టం చేసిన‌ది. పౌరులపై కాల్పులు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు విచారకరం అని పేర్కొన్న‌ది. భద్రతా సిబ్బందికి కూడా  పలువురికి తీవ్రంగా గాయాలైనట్టు తెలిపింది.ఘటనకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణెకు అధికారులు ఇప్ప‌టికే వివరించారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో విచారం వ్యక్తం చేసారు. పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని దురదృష్టమైన ఘటనగా అభివర్ణించిన ఆయన, దీనిపై సిట్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేసారు ముఖ్య‌మంత్రి.  బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, అన్ని వర్గాలు శాంతియుతంగా ఉండాలని కోరారు.
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న పై ఆగ్ర‌హించిన స్థానికులు భ‌ద్ర‌తా బ‌ల‌గాల వాహ‌నాల‌కు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: