ఢిల్లీలో మరో దారుణం...వైద్యురాలిని అత్యాచారం చేసిన ఎయిమ్స్ డాక్టర్..!
ఈకేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు కూలంకుశంగా వెల్లడించారు. గత నెల సెప్టెంబర్ 26న ఏయిమ్స్లో విధులు నిర్వహిస్తున్న ఓ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ తన ఇంట్లో బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు తన తోటి వైద్యులు హాజరయ్యారు. అందులో ఓ మహిళా డాక్టర్ కూడా ఉంది. పుట్టినరోజు వేడుకలు ముగిసే సమయం ముందర కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి మహిళా డాక్టర్కు ఇచ్చాడు రెసిడెంట్ డాక్టర్. ఆమె అది తాగి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెపై ఆ డాక్టర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడిపోయింది. కొద్ది రోజుల తరువాత మిత్రుల సహకారంతో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన తరువాత రోజు నుంచే ఆ డాక్టర్ అదృశ్యమై పోయాడు. గత నెల 27 నుంచి నిందితుడు విధులకు సైతం హాజరవ్వడం లేదని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.
వైద్యులు నిర్వహించిన పరీక్షలో ఆ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసినట్టు వెల్లడైంది. నిందితునిపై ఐపీసీ సెక్షన్ 376, 377 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు పోలీసులు. దేశరాజధాని అయిన ఢిల్లీ నగరంలో మహిళలకు మాత్రం భద్రత కరువైందని స్థానికులు పేర్కొంటున్నారు. అక్కడ రోజుకు ముగ్గురు నుంచి నలుగురు మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. జనవరి నుంచి ఆగస్టు 15వ తేదీ వరకే 1231 ఘటనలు జరగడం సంచలనంగా మారింది. అధికారికంగానే ఈ విధంగా ఉంటే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయోనని పలువురు చర్చించుకుంటున్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో 908 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఎక్కువ శాతం వారు బందువులో, కుటుంబ సభ్యులో, పక్కింటి, ఎదురింటి, స్నేహితులు ఉంటున్నారు. నమ్మిన వ్యక్తులే ఎక్కువగా ఈ ఘాతుకానికి పాల్పడుతుండడంతో మహిళల భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన ఈ ఘటనలో ప్రాణాలను కాపాడే ఒక ఉన్నతమైన వైద్యవృత్తిలో ఉన్న వ్యక్తి , అందులో మరల ఎయిమ్స్ డాక్టర్ కావడం విపరీతమైన విమర్శలకు నిదర్శనంగా మారింది.