ప్రస్తుతం టాలీవుడ్ను డ్రగ్స్ వ్యవహారం షేక్ చేస్తున్న తరుణంలోనే తెలుగు రాష్ట్రంతో ముడిపడి ఉన్న మరో మాదక ద్రవ్యాల దందా వెలుగులోకి వచ్చింది. ఏపీలో బెజవాడ కేంద్రంగా వ్యాపారంగా సాగించ ఓ వ్యాపార సంస్థ టాల్కమ్ పౌడర్ బిజినెస్ మాటున డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతోందన్న అనుమానాలు రేకెత్తాయి. ఈ వ్యవహారం గుజరాత్లో బయటపడింది. ఇది దేశంలోనే మరో పెద్ద డ్రగ్స్ రాకెట్ దందా అని డీఆర్ఐ అధికారులు అంటున్నారు. సుమారు 9 వేల కోట్ల రూపాయలు విలువ జేసే డ్రగ్స్ను సీజ్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. కాగా గుజరాత్లో పట్టుబడిన డ్రగ్స్ ముఠాకు బెజవాడతో కనెక్షన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలవారు ఇచ్చిన సమాచారం మేరకు.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్లో ఉన్న ముంద్రా ఓడరేవుకు చేరుకున్నారు. అక్కడ మెరుపుదాడులు జరిపారు. డ్రగ్స్ను కంటైనర్లలో ఉంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. కంటైనర్లను సీజ్ చేశారు. అందులో సోదాలు జరపగా హెరాయిన్ కనిపించింది. పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు 9 వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నది అధికారుల అంచనా. ఈ కంటైనర్లు ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. సీజ్ అయిన కంటైనర్లన్నీ ఏపీలోని బెజవాడకు సంబంధించిన ఓ ట్రేడింగ్ కంపెనీకి చెందినవి అని తేల్చారు. టాల్కమ్ పౌడర్ వ్యాపారం మాటున డ్రగ్స్ స్మగ్లింగ్ సాగిస్తున్నట్లు తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.
టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతుండగానే.. విజయవాడతో లింకులు కలిగిన భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు గుజరాత్లో వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. పలువురు సినీ ప్రముఖులను ప్రశ్నించింది. మనీలాండరింగ్ కోణంలో విచారణ సాగిస్తోంది. ఇదివరకే చాలా మంది సెలబ్రిటీలు ఎక్సైజ్ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో దేశంలోనే మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు కావడం.. దీనికి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో కనెక్షన్ ఉండటంతో డీఆర్ఐ అధికారులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు.