చిన్నారి ప్రాణం తీసిన సర్పాలు.. చేతికి, కాలు పై కాట్లు..
వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కర్నూలు జిల్లా నందవరం మండలంలోని యానం గ్రామానికి చెందిన నాగరాజు, నరసమ్మ దంపతుల మూడో కుమార్తె మల్లేశ్వరి. ఆమె మంత్రాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి నిద్రకు ఉపక్రమించింది. నిద్రలో ఉన్న సమయంలో ఆమెకు ఏదో కరిచినట్లు మంటగా అనిపించింది.
తండ్రికి చెప్పింది. ఆయన వెంటనే అప్రమత్తమై లైట్ వేసి చూశాడు. మల్లేశ్వరి చేతి వద్ద ఓ పాము, కాలు వద్ద మరో పాము కనిపించాయి. వెంటనే వాటిని చంపేశాడు. అనంతరం చికిత్స నిమిత్తం కుమార్తెను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రి కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాని కి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. బాగా చదివి, జీవితం లో ఉన్నత స్థితిలో ఉంటుందనుకుంటున్న కుమార్తె హఠాత్తుగా చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.