కాపురంలో సెల్ ఫోన్ చిచ్చు.. కొత్త పెళ్లికూతురు అనుమానాస్పద మృతి..
స్థానిక పోలీసులు ఏం చెప్పారంటే..?
భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన యోహాను, మరియమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నకుమారికి ఇటీవల వివాహం జరిగింది. ఆమె వయసు 19 సంవత్సరాలు. రత్నకుమారిని ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన సన్నీకి ఇచ్చి పెళ్లి చేశారు. ఫిబ్రవరి 18న రత్నకుమారి, సన్నీ వివాహం జరిగింది. వ్యవసాయ పనులతో సన్నీ కూడా తన అత్తగారి ఇంటిలోనే నివాసం ఉండేవాడు. రత్నకుమారి ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. రిజల్ట్ కోసం ఆమె వేచి చూస్తోంది. అయితే ఈనెల 13న భార్యా భర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. సెల్ ఫోన్ కారణంగా రత్నకుమారి కుటుంబ సభ్యులతో గొడవపడినట్టు తెలుస్తోంది. మనస్థాపం చెందిన రత్నకుమారి క్షణికావేశంలో కలుపుమందు తాగినట్టు చెబుతున్నారు కుటుంబ సభ్యులు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
రత్నకుమారిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ రత్నకుమారి చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. రత్నకుమారి మృతితో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. కొత్తగా పెళ్లైన అమ్మాయి అప్పుడే ఇలా చనిపోతుందని ఊహించలేదని, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. చిన్న చిన్న విషయాలే ఇప్పుడు కుటుంబాల్లో కలహాలు నింపుతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ప్రాణాలు పోతున్నాయి.